తెలుగు రాష్ట్రాల మధ్య రచ్చకు కారణమవుతుందని భావిస్తున్న పోలవరం-బానకచర్ల ప్రాజెక్టు… ఇరు రాష్ట్రాల మధ్య మరింత స్నేహ సంబంధాలను పెంపొందించనుందని చెప్పక తప్పదు. ఇందుకు ఈ ప్రాజెక్టుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వ్యూహమే కారణమని చెప్పాలి. వాస్తవంగా బాబు కంటే రాజకీయాల్లో జూనియర్ అయిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలు విన్నవారు… బానకచర్ల ఇరు రాష్ట్రాల మధ్య పెద్ద గొడవనే సృష్టిస్తుందని భావించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలపై గురువారం బాబు స్పందనను చూస్తే.. ఈ ప్రాజెక్టు ద్వారా ఇరు రాష్ట్రాలు మరింత సన్నిహితం కానున్నాయన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి.
అయినా బానకచర్ల ప్రాజెక్టుపై బాబు ఏమన్నారన్న విషయానికి వస్తే… “ప్రాజెక్టుల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు అవసరం లేదు. అస్సలు నీటి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు ఎందుకు? మిగులు జలాలతోనే బానకచర్లను కట్టానుకుంటున్నాం. గోదావరి జలాల్లో ఏటా 3 వేల టీఎంపీలు సముద్రంలో వృథాగా కలిసిపోతున్నాయి. వాటిలో ఓ 200 టీఎంసీలను వినియోగించుకోవడానికి బానకచర్లకు ప్రణాళికలు రచించాం. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ రతనాల సీమ అవుతుంది. ఒకవేళ తెలంగాణ ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలుంటే ఢిల్లీలో కూర్చుని మాట్లాడుకుంటాం. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాం. మిగులు జలాల్లో వాటా కావాలంటే కూడా తెలంగాణ తీసుకోవచ్చు. కేంద్రం వద్ద కూర్చుని చర్చించుకుని ఒప్పందం చేసుకుందాం” అని బాబు పేర్కొన్నారు.
వాస్తవానికి తెలంగాణలోని చాలా ప్రాజెక్టులకు అనుమతులే లేవు. అయినా గానీ నాటి బీఆర్ఎస్ సర్కారు ప్రాజెక్టులు కట్టుకుంటూ వెళ్లింది. కేంద్రం కూడా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడైనా చర్చకు వస్తే.. ఏపీ నుంచి తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు లేవన్న మాట వినిపించేది. ఇప్పుడు ఇదే విషయాన్ని రేవంత్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా.. తమ ప్రాజెక్టులకు మాత్రం అనుమతులు ఇవ్వాలంటూ ఏపీ కోరడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అయితే నాటి పరిస్థితులను ఆయన అంతగా బేరీజు వేయకుండానే ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు అయితే వినిపించాయి.
అయితే రాజకీయాల్లో తల పండిన చంద్రబాబు పొరుగు రాష్ట్రం… అది కూడా మరో తెలుగు రాష్ట్రంతో గొడవలు పెట్టుకునే ఉద్దేశమే తనకు లేదని విస్పష్టంగా తేల్చి చెప్పారు. పొరుగు రాష్ట్రంతో మిత్ర ధర్మంతోనే ముందుకు సాగుతామన్న చంద్రబాబు… బానకచర్ల అయినా ఇంకే ప్రాజెక్టు అయినా సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునేందుకే తాను ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. వివాదాలకు తాను దూరంగా ఉంటానని, అలాంటిది తాను అభివృద్ధి చేసిన తెలంగాణతో తానెందుకు విభేదాలు కొని తెచ్చుకుంటానని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఈ తరహా వైఖరితో బానకచర్లకు సామరస్యపూర్వకంగా చంద్రబాబు కేంద్రం నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ సాధిస్తారని ఘంటాపథంగా చెప్పొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates