ఆ పాత ఫోన్లు ఏమయ్యాయి కేటీఆర్!

ఫార్మూలా ఈ కారు రేసుల వ్యవహారంలో ఇప్పటిదాకా రెండు పర్యాయాలు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరైన సంగతి తెలిసిందే. సోమవారం జరిగిన రెండో దఫా విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు… 2021 నుంచి 2024 మధ్యలో వినియోగించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేయాలని కేటీఆర్ ను కోరారు. అయితే ఇఫ్పుడు వాటిని తీసుకురాలేదని తప్పించుకున్న కేటీఆర్ తాజాగ బుధవారం అసలు ఆ ఫోన్లు ఇప్పుడు తన వద్ద లేవని ఏసీబీకి షాకిచ్చేలా ఓ లేఖ రాశారు.

2021 నుంచి 2023 చివరి వరకు తాను వాడిన ఫోన్లను తీసేసి… 2024లో కొత్త ఫోన్లను తీసుకున్నానని కేటీఆర్ ఏసీబీకి రాసిన లేఖలో తెలిపారు. గతంలో వాడేసిన ఫోన్లను తాను తన వద్ద ఎందుకు ఉంచుకుంటానని ప్రశ్నించిన కేటీఆర్… ప్రస్తుతం ఆ పాత ఫోన్లు ఇప్పుడు తన వద్ద లేవని, అసలు అవి ఎక్కడున్నాయో కూడా తనకు తెలియదని తెలిపారు. వాడేసిన ఫోన్లను డిస్పోజ్ చేస్తాం కదా… డిస్పోజ్ చేసిన ఫోన్లను తీసుకురమ్మంటే ఎలా తీసుకువచ్చేది అంటూ ఆయన ఓ లాజిక్ ను వినియోగించాురు.

ఏసీబీకి రాసిన లేఖను కేటీఆర్ ఈ విషయాలతోనే సరిపెట్టేసి ఉంటే సరిపోయేది. అయితే ఆయన అలా చేయలేదు. ఫోన్లను స్వాధీనం చేయడమంటే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఈ తరహా చర్యలు తన వ్యక్తిగత ప్రతిష్ఠను మంటగలిపేవేనని కూడా కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద పాత ఫోన్లు లేవంటూనే.. ఇలా వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతుంది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.