ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన సాక్షి టీవీ ఇన్ పుట్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం జైలు నుంచి విడులయ్యారు. సాక్షి టీవీ చర్చా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వచ్చిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు.. అమరావతి మహిళలను కించపరిచే రీతిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను నిలువరించాల్సిన యాంకర్ స్థానంలోని కొమ్మినేని ఆ మాటలకు నవ్వారు. దీంతో వారిద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు గుంటూరు జైలుకు తరలించారు.
అయితే ఓ యాంకర్ గా ఇందులో తన తప్పేం ఉందని వాదించిన కొమ్మినేని కింది కోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ ఆలస్యం అవుతుందన్న భావనతో ఆయన ఆ మరుక్షణమే నేరుగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత శెుక్రవారం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు… కొమ్మినేనికి బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా బెయిల్ షరతులను ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని, తక్షణమే కొమ్మినేనిని విడుదల చేయాలని సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
అయితే శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా సాయంత్రం వరకు ఉత్తర్వుల కాపీ మాత్రం విడుదల కాలేదు. ఇక ఆ మరునాడు రెండో శనివారం కావడంతో కోర్టులకు సెలవు వచ్చింది. ఆదివారం కూడా సెలవు రావడంతో కొమ్మినేని బెయిల్ ఉత్తర్వులు విడుదల కాలేదు. దీంతో అటు సుప్రీంకోర్టు, ఇటు ట్రయల్ కోర్టు వద్ద వైసీపీ లీగల్ టీం పడిగాపులు కాసి మరీ సోమవారం మధ్యాహ్నానికి బెయిల్ ఉత్తర్వులను జైలు అదికారులకు అందజేశారు. దీంతో సోమవారం చివరి క్షణంలో కొమ్మినేని గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఇక అసలు నిందితుడు కృష్ణంరాజు మాత్రం ఇంకా గుంటూరు జైల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates