బాకీ వసూలు బలవంతమైతే జైలే గతి

అప్పు ఇచ్చుడు దాకా ఓకే. దానిని వసూలు చేయడం అంత వీజీ కాదు. కాస్తంత టెక్నిక్ తెలిసిన రుణ దాతలు అయితే ఫరవా లేదు గానీ… అదో లోకం రుణ దాతలు అయితే మాత్రం అప్పులు ఇవ్వరాదు, ఇబ్బందులు కొని తెచ్చుకోరాదు. ఇప్పుడు తమిళనాడుకు వెళితే… రుణ గ్రహీతలకు వర ప్రసాదం లాంటి ఓ చట్టం వచ్చింది. అదేంటంటే… అప్పు ఇచ్చిన వారు అప్పు తీసుకున్న వారి దగ్గర నుంచి ఆ అప్పును సామరస్యపూర్వకంగానే వసూలు చేసుకోవాలి. అప్పు వసూలులో ఏమాత్రం బలవంతం చోటుచేసుకున్నా అప్పు ఇచ్చిన పాపానికి రుణ దాతలకు ఐదేళ్ల జైలు శిక్ష తప్పదట.

ఈ మేరకు బలవంతపు అప్పుల వసూళ్లను నిలువరించే దిశగా తమిళనాడులోని డీఎంకే సర్కారు ఓ బిల్లును రూపొందించి…దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టగా..అక్కడ ఆ బిల్లు పాస్ అయిపోయింది. ఈ బిల్లును ఎంకే స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్ కు పంపగా… అసెంబ్లీ ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్ భవన్ ఆమోద ముద్ర వేసింది. వెరసి ఈ బిల్లు చట్టంగా మారిపోయింది. రాష్ట్రంలో అమలులోకి వచ్చేసింది కూడా. అంటే… తమిళనాట ఇకపై అప్పు వసూలుకు బలప్రయోగం తగదు. పొరపాటున బలప్రయోగం చేసి అప్పు వసూలు చేస్తే మాత్రం ఐదేళ్ల జైలు శిక్ష తప్పదు మరి.

ఇక ఈ అప్పు బలవంతపు వసూలులో భాగంగా రుణ గ్రహీతల ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం కూడా కుదరదట. అంతేకాదండోయ్… రుణ దాతల వేధింపులతో తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని రుణ గ్రహీతలు పొరపాటున నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంటే… ఇక ఆ రుణ దాతకు కనీసం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కు కూడా ఉండదట. అంటే… దేశవ్యాప్తంగా ఏదో నార్కోటిక్, అట్రాసిటీ కేసుల మాదిరిగా అన్న మాట. ఇక రుణ దాతల విషయంలో వ్యక్తులతో పాటుగా సంస్థలకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్టాలిన్ సర్కారు తేల్చి చెప్పింది.