జ‌గ‌న్ వేశారు.. బాబు తీశారు.. వారంతా హ్యాపీ!

వైసీపీ హ‌యాంలో విధించిన కొన్ని ప‌న్నుల‌తో అన్ని వ్య‌వ‌స్థ‌లు ఇబ్బందులు ప‌డ్డాయి. వీటిలో ప్రైవేటు విద్యాసంస్థ‌లు కూడా ఉన్నాయి. ‘గ్రీన్ ట్యాక్స్’ పేరుతో ప్రైవేటు విద్యాసంస్థ‌ల‌కు చెందిన వాహ‌నాల‌పై వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్‌.. గ్రీన్ ట్యాక్స్ బాదేశారు. అయితే.. అంతిమంగా ఇది విద్యార్థుల‌కు, వారి త‌ల్లిదండ్రుల‌కే చుట్టుకుంది. దీంతో ఫీజులు కూడా పెరిగాయి. ర‌వాణా చార్జీలు కూడా పెరిగిపోయాయి. ఈ క్ర‌మంలో ఆయా స్కూళ్ల యాజ‌మాన్యాల‌తో పాటు.. విద్యార్థుల త‌ల్లిదండ్రులు కూడా అప్ప‌టి ప్ర‌భుత్వానికి మొర పెట్టుకున్నాయి. అయినా.. జ‌గ‌న్ వినిపించుకోలేదు.

తాజాగా.. సీఎం చంద్ర‌బాబు గ్రీన్ ట్యాక్స్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల వాహ‌నాల‌కు జ‌గ‌న్ హ‌యాం లో విధించిన గ్రీన్ ట్యాక్స్‌ను రద్దుచేశారు. ఈ విష‌యాన్ని ర‌వాణాశాఖ మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్ చెప్పారు. ప్రైవేటు విద్యాసంస్థ‌ల‌కు చెందిన‌ బస్సులపై గ్రీన్ టాక్స్ ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు మండిపల్లి రాంప్రసాద్ చెప్పారు. కరోనా కాలంలో రెండు సంవత్సరాల పాటు స్కూల్స్ మూతబడిన నేపథ్యంలో వాడుకలో లేనైనప్పటికీ బస్సులకు పన్నులు వ‌సూలు చేశార‌ని చెప్పారు. విద్యా సంస్థ‌ల బ‌స్సులు రోజుకు కేవలం 50-60 కిలోమీటర్లకే పరిమితమవుతాయని, సంవత్సరం పొడవునా 220 రోజులు మాత్రమే నడుస్తాయని, అయినా వాటిపై ప‌న్నులు విధించార‌ని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో చేపట్టిన విధానాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా వాహనాల జీవితకాలాన్ని రెండు సంవత్సరాలు పొడిగించాలని నిర్ణ‌యించిన‌ట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌పై భారం త‌గ్గించాల‌ని కూడా నిర్ణ‌యించిన‌ట్టు పేర్కొన్నారు. గ్రీన్ ట్యాక్స్‌కు బ‌దులుగా మొక్క‌ల పెంప‌కానికి ప్రాధాన్యం ఇచ్చేలా విద్యార్థుల‌తో మొక్క‌లు పెంచేలా ప్రొత్స‌హించేం దుకు విద్యాసంస్థ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌న్నారు. దీంతో జ‌గ‌న్ వేసిన భారం తొలిగిపోయింద‌ని విద్యా సంస్థ‌లు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు కూడా వ్యాఖ్యానించారు.