రాష్ట్రాలకు కేంద్రం ‘వ్యాక్సిన్’ సంకేతం

ఆ దేశంలో వ్యాక్సిన్ రెడీ.. ఈ దేశంలో వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు.. ఫలానా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్‌తో సత్ఫలితాలు.. అని వార్తల గురించి మాట్లాడుకోవడానికే సరిపోతోంది. మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి.. ప్రభుత్వం చేతికి వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయి.. జనాలకు వాటిని ఎప్పుడు వేస్తారు అన్నది మాత్రం తెలియడం లేదు. ఆగస్టు 15కే వ్యాక్సిన్ అంటూ ఊరించిన నేతలు, ఫార్మా కంపెనీల ప్రతినిధుల మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. ఏడాది చివరికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు ఈ విషయమై కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పటి నుంచి మరో వంద రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని.. కాబట్టి టీకా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సంకేతాలు ఇచ్చింది.

తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్.. హర్షవర్ధన్‌ను ప్రశ్నించారు. అందుకాయన.. ‘అతి త్వరలోనే వస్తుంది. మీరంతా వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉండాలి’ అని బదులిచ్చారు. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ఆరంభంలో రాష్ట్రాల వద్దకు కరోనా వ్యాక్సిన్‌ను చేర్చే ప్రయత్నం చేస్తామని హర్షవర్ధన్ సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది.

టీకా వివరాలు, దాన్ని నిల్వ చేయడం, రవాణా చేయడం, ముందుగా ఎవరెవరికి వ్యాక్సిన్ వేయాలనే విషయమై ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల అధికారులు కేంద్రంతో సమన్వయం చేసుుకంటూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. హర్షవర్ధన్ గతంలో అన్నట్లు మార్చిలో ఎంపిక చేసిన వాళ్లకు కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ ఇచ్చే అవకాశముంది. సామాన్య జనానికి ఇంకో రెండు మూడు నెలల తర్వాత వ్యాక్సినేషన్ చేయించే అవకాశముంది.