ఏపీలో రేషన్ కార్డుల దరఖాస్తు విధానం మొదలు పంపిణీ వరకు కూటమి ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన మార్పులు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ లో రేష్ కార్డు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు. వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ వంటి సౌకర్యాలు కల్పించి ప్రజల మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే తాజాగా రేషన్ పంపిణీ వ్యవహారంలో కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పీవోఎస్ మెషీన్ సర్వర్ పనిచేయనప్పుడు అవసరమైతే లబ్ధిదారుల ఫొటో, సంతకం తీసుకొని రేషన్ ఇవ్వాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది.
అంతేగానీ, సర్వర్ పనిచేయడం లేదంటూ రేషన్ తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులను వెనక్కు పంపవద్దని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రేషన్ సరుకుల పంపిణీలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దని డీలర్లకు చెప్పారు. ఏలూరులో ఓ రేషన్ దుకాణంలో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మనోహర్ అక్కడ రేషన్ పంపిణీలో ఏమైనా ఇబ్బందులున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆ దుకాణంలో బియ్యంతోపాటు ఇతర సరుకులను భద్రపరుస్తున్న తీరు, తూకం వంటి పలు విషయాలను మనోహర్ పరిశీలించారు.
గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం రేషన్ అందిస్తున్న విధానం బాగుందని లబ్దిదారులు మనోహర్ తో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో డోర్ డెలివరీ అని చెప్పినా…రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడేవాళ్లమని, వాహనం వచ్చినా వీధి చివర రేషన్ కోసం పడిగాపులు కాయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదని చెప్పారు. వృద్ధులు మరియు వికలాంగులకు రేషన్ ఇంటికే డోర్ డెలివరీ విధానం బాగుందని అంటున్నారు. రేషన్ షాపులు రెండు పూటలా తెరవడం వల్ల తమకు వీలున్న సమయంలో వచ్చి రేషన్ తీసుకుంటున్నామని చెబుతున్నారు.