మంచి చేస్తే కూటమిని అభినందిస్తా: అబ్బయ్య చౌదరి

మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారంటూ ఆ పార్టీ యువ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి శుక్రవారం ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తాను పార్టీ మారడం లేదని చెప్పిన అబ్బయ్య…మంచి పని చేస్తే కూటమి సర్కారును అభినందిస్తానని, ఆ విషయంలో అందరికంటే కూడా తాను ముందు వరుసలో ఉంటానని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అదికారంతో ప్రజలకు మంచి చేయాల్సి ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక ఇటీవలే బీజేపీ సీనియర్ నేత, భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఏలూరు జిల్లా పర్యటనకు వెళ్లగా… వెంకయ్యతో భేటీ అయిన అబ్బయ్య.. వెంకయ్యను నేరుగా గన్నవరం విమానాశ్రయం వరకు సాగనంపి ఎయిర్ పోర్టులో విమానం ఎక్కించి మరీ వచ్చారు. ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చినంతనే అబ్బయ్య వైసీపీని వీడి బీజేపీలో చేరిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ప్రింట్ మీడియా అయితే ఓ మోస్తరుగా రాస్తున్నా.. ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం ఈ విషయాన్ని అదే పనిగా ప్రసారం చేస్తూనే ఉంది.

ఈ ప్రచారంపై వివరణ ఇచ్చేందుకు అబ్బయ్య శుక్రవారం సాయంత్రం ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అబ్బయ్య… అక్కడి నుంచే ఈ వీడియోను రికార్డు చేసి విడుదల చేశారు. తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలన్నీ అసత్యాలని ఆయన చెప్పారు. తమ కుటుంబం తొలుత వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి 20 ఏళ్లుగా సాగిందని, ఆ తర్వాత 15 ఏళ్లుగా జగన్ తో సాగుతున్నామని తెలిపారు. రాజకీయాలన్నాక గెలుపు, ఓటములు సహజమన్న అబ్బయ్య… ఓటమితో తానేదో భయపడిపోయి వైసీపీని వీడి అధికారంలోని పార్టీల్లో చేరిపోతానంటూ పుకార్తు షికారు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దెందులూరు నుంచి తనను దూరం చేయాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారని అబ్బయ్య ఆరోపించారు. అయితే అది జరగని పని అని ఆయన అన్నారు. రాజకీయాల్లో బలంగా ఉండాలంటే వ్యాపారాల్లోనూ బలంగానే ఉండాలన్న సూక్తి మేరకు తన వ్యాపారాల పని మీద ప్రస్తుతం అమెరికా వచ్చానని, ఇక్కడ ఓ కాన్ఫరెన్స్ కు తాను హాజరవుతున్నానని తెలిపారు. ఆ మాత్రానికే తానేదో విదేశాలకు వెళ్లిపోయానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యాపార, వ్యక్తిగత పనుల నిమిత్తం పలుమార్లు పలు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్న ఆయన త్వరలోనే దెందులూరు వచ్చి వైసీపీకి చెందిన ప్రతి కార్యకర్తను కలుస్తానని తెలిపారు.