ఆరోప‌ణ‌ల‌కు ఆధారాలు ఉండాలి: కేటీఆర్‌కు సుప్రీం నోటీసులు

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ చిక్కుల్లో ప‌డ్డారు. ఇప్ప‌టికే ఆయ‌న‌పై సీఐడీ కేసు ఉంది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు కూడా ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. ఆరోపణ‌లు చేసే ముందు.. ఆలోచ‌న ఉండాల‌ని.. అదేవిధంగా ఆధారాలు కూడా ఉండాల‌ని పేర్కొంది. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వాల‌పై ఇష్టానుసారం ఆరోప‌ణ‌లు చేయ‌డం ఫ్యాష‌న్‌గా మారిందా? అని ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో కేటీఆర్ చేసిన ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసులు జారీ చేసింది.

ఏం జ‌రిగింది?

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కొత్త‌లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివ‌ర్గం అవినీతికి పాల్ప‌డుతోంద‌ని.. ఒక్క ప్రాజెక్టులోనే 25 వేల కోట్ల మేర‌కు సొమ్ములు నొక్కేశార‌ని కేటీఆర్ ఆరోపించారు. అయితే.. ఈవ్య‌వ‌హారం కాస్తా దుమారం రేపింది. దీనిపై కోర్టుకు వెళ్తామ‌ని.. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు అప్ప‌ట్లో నే స‌వాల్ రువ్వారు. కేటీఆర్‌పై విమ‌ర్శ‌లు కూడా చేశారు. అయితే.. కేటీఆర్ మౌనం వ‌హించారు. దీంతో గ‌డువు తీరిన త‌ర్వాత కూడా.. కేటీఆర్ మౌనంగా ఉండ‌డంతో ఆత్రం సుగుణ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

కేటీఆర్ త‌మ ప్ర‌భుత్వంపై చేసిన అవినీతి ఆరోప‌ణ‌ల‌పై కేసు పెట్టారు. దీంతో స‌ద‌రు కేసును కొట్టి వేయాల‌ని కోరుతూ.. కేటీఆర్‌ హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో అప్ప‌ట్లో ఉట్నూరు పోలీసులు న‌మోదు చేసిన కేసును, ఎఫ్ ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేసింది. అయితే.. ఆత్రం సుగుణ మాత్రం.. దీనిని వ‌దిలి పెట్టకుండా .. సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు.

తాజా ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ ధర్మాసనం.. కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ఆరోప‌ణ‌లకు ఆధారాలు ఉన్నాయా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వంపై అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌లు చేసే ముందు .. ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుంటే బాగుండేద‌న్న న్యాయ‌స్థానం.. దీనిపై స‌మాధానం చెప్పాల‌ని కేటీఆర్‌ను ఆదేశిస్తూ..నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.