నిజమేనండోయ్… ఈ నెల 12న ఏపీలో మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదంటే ఏమిటీ? అంటారా? ఆనాడు ఏపీలో నెలకొనే సంబరాలకు సరిపడ పేరు తట్టడం లేదు మరి. అందుకే ఆ రోజు ఏపీలో మామూలుగా ఉండదని మాత్రం చెప్పగలం. అయినా ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటారా? జూన్ 12న ఏపీలో కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తి అయ్యి… కూటమి పాలన రెండో ఏడాదిలోకి అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు తీర్మానించారు.
సరే మరి… ఆ సంబరాలు ఏ స్థాయిలో జరగనున్నాయన్న విషయానికి వస్తే ఏపీవ్యాప్తంగా దాదాపుగా అన్ని గ్రామాల్లోనూ వేడుకలు జరిగేలా కూటమి సర్కారు ప్లాన్ చేస్తోంది. అందుకే ఈ సంబరాలను ఏదో సాధారణ వేడుక అనో, ఉత్సవం అనో, మహోత్సవం అనో, పండుగ అనో, సంక్రాంతి అనో, దసరా అనో, ఉగాది అనో చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే… ఈ పండుగల్లో ఓ పండుగ ఓ ప్రాంతంలో బాగా జరిగితే మరో ప్రాంతంలో మరో పండుగకు ప్రాధాన్యం దక్కుతుంది. అయితే కూటమి సర్కారు చేస్తున్న సన్నాహాలు చూస్తుంటే మాత్రం ఏపీవ్యాప్తంగా ఆ రోజు ఊరూవాడా ఒక్కటిగా కదలడం ఖాయమని చెప్పొచ్చు.
అయినా ఆ రోజు ఏం చేస్తారంటే… సీఎంఓ కార్యాలయ వర్గాల సమాచారం మేరకు జూన్ 12న ఏపీలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ పనులు ఏదో ఒక నియోజకవర్గానికో, ఒక మండలానికో, ఒక గ్రామానికో సంబంధించినవి కాకుండా దాదాపుగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన పనులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఏఏ శాఖల కింద ఏఏ పనులు ప్రారంభించడానికి వీలుందన్న అంశాన్ని పరిశీలించి షార్ట్ లిస్ట్ చేయాలని ఇప్పటికే అధికార యంత్రాంగానికి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఎందుకీ సంబరాలు అంటే… ఇటు ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయం అయినా చరిత్రలో నిలిచిపోయేదే. ఇక ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఏకంగా రూ.9.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులను కూటమి నేతలు సాధించారు. వీటి ద్వారా ఏకంగా 8.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏ రాష్ట్రానికి అయినా ఒక్క ఏడాదిలో ఈ మేర పురోగతి కనిపించిందంటే… అది రికార్డు కిందే లెక్క. ఈ లెక్కన రికార్డు విజయంతో అధికారంలోకి వచ్చి రికార్డు స్థాయిలో పెట్టుబడులు సాధించిన కూటమి ప్రభుత్వం… తమ ఏడాది పాలనను కూడా చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని భావించడంలో తప్పు లేదు కదా. అందుకే…జూన్ 12న ఏపీలో మామూలుగా ఉండదు.