ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వెలుపల ఏర్పాటు చేసిన విజయోత్సవ సభ విషాదంగా మారిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చిన వేళ, గేటు నెం.7 వద్ద తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని విషాదంలోకి నెట్టింది.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “ఆ చిన్నారుల గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. 15 ఏళ్ల వయసు పిల్లలు 10 మంది చనిపోవడం నా కళ్లారా చూశాను. ఆ కుటుంబాలు ఈ నష్టాన్ని ఎలా భరిస్తాయో అర్థం కావడం లేదు” అంటూ మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలు చూశానని, తన గుండె ఒడిదుడుకులకు లోనైందని చెప్పారు.
అలాగే, పోలీసులు ఇచ్చిన సూచనపై స్పందిస్తూ… “కార్యక్రమాన్ని పది నిమిషాల్లో ముగించమని పోలీస్ కమిషనర్ నాతో చెప్పారు. అప్పటికే ఒకరిద్దరు చనిపోయారని చెప్పారు. అందుకే వేడుకను తక్షణమే ముగించాం. పరిస్థితి ఎంత వేగంగా చేయిదాటి పోయిందో అర్థం కాలేదు” అని డీకే వివరించారు. ప్రభుత్వంగా మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు
ఇక ఈ ఘటనపై రాజకీయ విమర్శలు కూడా ఊపందుకున్నాయి. కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి, డీకే శివకుమార్కు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం సిద్ధరామయ్య మెజిస్టీరియల్ విచారణకు ఆదేశిస్తూ, 15 రోజుల్లో నివేదిక కోరారు. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది.
ఈ ఘటనలో భద్రతా ఏర్పాట్లు తీవ్రంగా విఫలమయ్యాయన్నది స్పష్టం. ఏకకాలంలో రెండు లక్షల మందికి పైగా గుమిగూడటాన్ని ముందుగానే అంచనా వేయకుండా, సరైన మార్గదర్శకాలు అమలు చేయకపోవడమే ఈ విషాదానికి దారితీసినట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.