పాత కేసులు ఉంటే కొట్టేస్తారా : జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాటి తెనాలి పర్యటన నిరసనలతో మొదలు కాగా… ఏ బాధితులను అయితే పరామర్శించడానికి వెళ్లారో…వారికే షాకిచ్చేలా జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పిల్లలను తాను వెనకేసుకుని రావడం లేదని ఆయన బహిరంగంగా ప్రకటించి… బాదితుల కుటుంబాలను ఆయన షాక్ కు గురి చేశారు. ఈ పిల్లలు గతంలో తప్పులు చేసి ఉండవచ్చు కూడా అని జగన్ వ్యాఖ్యానించారు. యుక్త వయసులో వారు చేసిన తప్పులపై కేసులు నమోదు అయితే వాటిలో దోషత్వాన్ని తేల్చాల్సింది కోర్టులే గానీ పోలీసులు కాదని ఆయన అన్నారు. 

తెనాలిలో ఐతా నగర్ కు చెందిన ముగ్గురు యువకులు ఓ కానిస్టేబుల్ పై దాడి చేశారన్న ఆరోపణలతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నడిరోడ్డుపై బహిరంగంగా వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఎప్పుడో నెల క్రితం జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో తాజాగా వెలుగులోకి రాగా… వైసీపీ భగ్గుమంది. ఇదేక్కడి లా అండ్ ఆర్డర్ అని జగన్ సహా వైసీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసుల దాడిలో గాయపడ్డ యువకులను పరామర్శించేందుకు తానే స్వయంగా తెనాలి వెళ్లాలని జగన్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రకటనపై టీడీపీ ఘాటు విమర్శలు చేసింది. గంజాయి బ్యాచ్ ను పరామర్శించేందుకు జగన్ వెళుతున్నారంటూ ఆరోపించింది.

ఈ ఆరోపణలను లెక్కచేయని జగన్ తాను అనుకున్నట్లుగానే మంగళవారం తెనాలి వెళ్లారు. అయితే తెనాలిలో అడుగుపెట్టగానే జగన్ కు నిరసన సెగ తగిలింది. గతంలో చనిపోయిన కిరణ్ డెడ్ బాడీ ఎక్కడ? అంటూ టీడీపీ కార్యకర్తలు నల్ల జెండాలు పట్టుకుని జగన్ కు నిరసన తెలిపారు. జగన్ గో బ్యాక్ అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనల మధ్యే ఐతా నగర్ చేరుకున్న జగన్ నేరుగా బాధితుడు జాన్ విక్టర్ ఇంటికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరు బాదితుల కుటుంబాలను కూడా అక్కడికే పిలిపించుకుని పరామర్శించారు. అనంతరం ఆయన జాన్ విక్టర్ ఇంటి ముందటే మీడియాతో మాట్లాడారు.

దాదాపుగా అరగంటకు పైగానే ప్రసంగించిన జగన్.. బాధితులపై పోలీసులు కాఠిన్యం ప్రదర్శించారని, రాష్ట్రంలో అమలు అవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది ప్రబల నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని విపులంగా వివరించిన జగన్… తన ప్రసంగం ముగిసే సమయానికి కాస్తంత ముందుగా… బాదితులపై గతంలో ఏ కేసులు ఉన్నాయో కూడా తనకు తెలియదని తెలిపారు. అంతటితో ఆగని ఆయన ఈ పిల్లలను తాను వెనకేసుకుని రావడం లేదని కూడా సంచలన ప్రకటన చేశారు. ఈ మాట విన్నంతనే బాధిత కుటుంబాలకు చెందిన సభ్యులు షాక్ కు గురయ్యారు. కేసులుంటే… వారు దోషులో, కాదో తేల్చాల్సింది కోర్టులు గానీ, పోలీసులు కాదని జగన్ అన్నారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదని ఆయన అన్నారు.