ఏపీలో రేషన్ పంపిణీ వ్యవస్థ ఆదివారం నుంచి పూర్తిగా మారిపోయింది. మొన్నటిదాకా వాహనాల ద్వారా జరిగిన రేషన్ సరుకుల పంపిణీకి స్వస్తి చెప్పిన కూటమి ప్రభుత్వం… పాత పద్ధతిలో రేషన్ డీలర్ల షాపుల వద్దే రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించారు. ఫలితంగా ఏపీవ్యాప్తంగా పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా రేషన్ సరుకుల పంపిణీ ప్రారంభోత్సవాలు కోలాహలంగా జరిగాయి. జనం రేషన్ డీలర్ల షాపులకు ఉత్సాహంగా తరలివచ్చి తమ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకులను అందుకున్నారు. వెరసి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా రేషన్ సరుకుల పంపిణీ ఆదివారం జనరంజకంగా ప్రారంభమైందని చెప్పక తప్పదు.
ఇక రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్… పవన్ ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభించడం గమనార్హం. ఈ కార్యక్రమానికి పవన్ హాజరు కాకున్నా… పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరయ్యారు. నాదెండ్లతో కలిసి ఆయన రేషన్ షాపుల ప్రారంభోత్సవంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి అటు నాదెండ్ల, ఇటు వర్మ హాజరు కావడంతో టీడీపీ, జనసేనకు చెందిన శ్రేణులు పెద్ద కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఫలితంగా పండుగ వాతావరణం నెలకొంది.
ఇదిలా ఉంటే… వైసీపీ పాలనా కాలంలో అప్పటిదాకా కళకళలాడిన 29,761 రేషన్ షాపులు ఎక్కడికక్కడ మూతపడి పోయాయి. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రేషన్ సరుకుల పంపిణీ కోసం వాహనాలను కొనుగోలు చేశారు. ఈ తరహా పద్ధతితో రేషన్ సరుకుల దోపిడీ బాగా పెరిగిపోయింది. జనం లేని సమయంలో వాహనాలు ఆయా కాలనీల్లోకి రావడం, కాసేపు వేచి చూసి వెళ్లిపోవడం, ఆ తర్వాత తాము వచ్చామని, మీరే లేరని లబ్ధిదారులపైకి ఎదురు తిరగడం, ఆపై మిగిలిన రేషన్ సరుకులను యథేచ్ఛగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ రేషన్ సరుకులన్నీ కాకినాడ, విశాఖ పోర్టుల ద్వారా దేశం దాటి వెళ్లిపోయేవి.
కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దందాను గమనించి.. దాని ప్రక్షాళనకు నడుం బిగించింది. రేషన్ సరుకుల అక్రమ మాఫియాను అరికట్టాలంటే… పాత పద్ధతిలో రేషన్ డీలర్ల షాపుల వద్దే సరుకుల పంపిణీ సరైనదని కూటమి సర్కారు ఓ నిర్ధారణకు వచ్చింది. అనుకున్నదే తడవుగా జూన్ 1 (ఆదివారం) నుంచి డీలర్ షాపుల ద్వారానే రేషన్ సరుకుల పంపిణీని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూటమి పార్టీల నేతలు తమ పరిధిలోని రేషన్ షాపుల ప్రారంభోత్సవాల్లో ఆదివారం బిజీబిజీగా గడిపారు. జనం కూడా రేషన్ షాపులకు సంతోషంగా వెళ్లి సరుకులు అందుకున్నారు.