“నిన్నటితో నేను వాడే మందులు అయిపోయాయి. చేతిలో రూపాయి లేదు. నాకా.. పిల్లల్లేరు. ఒక్కదాన్నే బతుకుతున్నా. ఏం చేయాలో తోచలేదు. పింఛన్పైనే ఆధారపడి బతుకుతున్నా. రేపు ఆదివారం కావడం తో పింఛను ఆలస్యం అవుతుందన్నారు. కానీ.. ఇంతలోనే చంద్రబాబు నాకు పింఛను పంపించాడు. నా ప్రాణాలు కాపాడాడు. ఈ డబ్బులతో మందులు కొనుక్కుంటా.” అని విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట నియోజకవర్గానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతినెలా 1వ తేదీనే ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ను.. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో మే 31న శనివారమే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు. అయితే.. మహానాడు హడావుడిలో ఉన్న ప్రభుత్వం దీనిపై పెద్దగా ప్రచారం చేయలేదు. పట్టించుకోలేదు. కానీ, జరగాల్సి కార్యక్రమం మాత్రం జరిగిపోయింది. దీంతో పింఛను పై ఆధారపడిన పేద జీవులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క అవ్వమాత్రమే కాదు.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పేదలు కూడా హ్యాపీ ఫీలవుతున్నారు.
ఎందుకంటే.. మేలో చాలా చోట్ల వర్షాలు కురిసాయి. దీంతో చిన్న చిన్న పనులు చేసుకుని ఫించనుతో పాటు మరో పదిరూపాయలు సంపాయించుకునే కుటుంబాలకు పనులు లేకుండా పోయాయి. ఈ నేప థ్యంలో వారు ఈ పింఛను సొమ్ముల కోసం ఎదురు చూశారు. ఈ క్రమంలో ప్రభుత్వంఒక్క రోజు ముందుగానే పింఛన్లను పంపిణీ చేయడం పట్ల సర్కారుకు కృత జ్ఞతలు చెబుతున్నారు. మరోవైపు.. రైతు కుటుంబాల్లోని లబ్ధి దారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా.. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. వారికి స్వయంగా పింఛన్లు అందించారు. మంత్రులు అనిత, సవిత, రామానాయుడు.. ఇలా.. అందరూ ఉదయం 7 గంటలకే రంగంలోకి దిగి.. సాధ్యమైనంత వేగంగా కార్యక్రమాన్ని పూర్తి చేసి.. లబ్ధిదారులకు మేలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు