మరో ఇద్ద‌రు పిల్ల‌ల్ని కంటారా? చంద్ర‌బాబు కొత్త సర్వే

అవును! మీరు చదివిందంతా నిజమే. పిల్లల్ని కంటారా? మీకు ఆ ఓపిక ఉందా? ఇప్పటికే మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు? వంటి అనేక ప్రశ్నలతో రాష్ట్రవ్యాప్తంగా 20 రోజులపాటు ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల వరకు ప్రతి ఇంటినీ ఈ సర్వేలో భాగం చేయనున్నారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సర్వే ద్వారా పిల్లలను కనే సామర్థ్యం ఉన్న కుటుంబాలను గుర్తించనున్నారు.

ఎందుకు ఈ సర్వే?

రాష్ట్రంలో జనాభా తక్కువగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో ఉన్న జనాభాతో పోల్చితే కోటి మందికి పైగా పెరిగారు. ప్రస్తుతం అంచనాల ప్రకారం రాష్ట్ర జనాభా 5.3 కోట్లు. అయితే కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో వాటాలు పెరగాలంటే జనాభా సంఖ్య మరింత పెరగాలి. జనాభా ఆధారంగా కేంద్ర నిధులను 14వ ఆర్థిక సంఘం కేటాయించింది. ఉత్తరాది రాష్ట్రాలు — ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు — ఎక్కువ లాభం పొందుతున్నాయి. 1990–2000 మధ్య దేశవ్యాప్తంగా జనాభా నియంత్రణ ఉద్యమం జరిగినప్పుడు, ఉత్తరాది రాష్ట్రాలు అందులో పెద్దగా పాల్గొనలేదు.

అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించాయి. ఇది మంచి పరిణామమే అయినా, కేంద్ర నిధులు తగ్గిపోవడంతో ప్రభుత్వాలు అప్పుల బాట పడుతున్నాయి. జనాభా పెంచడం ద్వారా కేంద్రం నుంచి మరింత నిధులు తీసుకురావచ్చు అన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. అందుకే ఆయన తరచూ జనాభా పెంచాలని పిలుపు ఇస్తున్నారు. కానీ ప్రజల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఇప్పుడు సర్వే చేపడుతున్నారు.

ఏం చేస్తారు?

ఈ సర్వే ద్వారా కుటుంబంలో ప్రస్తుతం ఎంత మంది పిల్లలు ఉన్నారు అన్నది తెలుసుకుంటారు. భార్యాభర్తలు యుక్త వయసులో ఉంటే, పిల్లల్ని కనగల సామర్థ్యం ఉంటే, వారికి ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుంది. ఇద్ద‌రు పిల్లలు ఉన్నా, మరింత మంది పిల్లలను కనాలని ప్రోత్సహించనుంది. అంతేకాదు, నలుగురు పిల్లల్ని కనే కుటుంబాలకు బ‌స్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ఆలోచన కూడా ఉంది. అదనంగా, ఇతర పథకాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ క్రమంలో మహిళల అభిప్రాయాలు తెలుసుకోవడానికి మహిళలనే సర్వేలో భాగం చేస్తారు. ఈ సర్వేలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.