‘కండువా’ను దూరం పెట్టిన కవిత… సంకేతాలేంటి?

kavitha

బీఆర్‌ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడినా, ప్రజల్లోకి వెళ్లి ఏదైనా కార్యక్రమాలు చేసినా, లేక పార్టీ కార్యక్రమాలు చేపట్టినా తప్పనిసరిగా ధరించేది బీఆర్‌ఎస్ కండువానే! ఈ విషయంలో సందేహం లేదు. ఏదైనా మర్చిపోతే తప్ప, లేకపోతే నాయకులు ఎంతటి వారైనా, ఎంత ఉన్నత పదవిలో ఉన్నా ఖచ్చితంగా కండువా వేసుకోవాలనీ గతంలో కేసీఆర్ కూడా ఆదేశించారు. అలా చేయకపోతే వారిని పార్టీ నాయకులుగా ఎలా గుర్తించాలని ఆయన కఠినంగానే హెచ్చరించారు.

దీనికి కారణం ఉంది. తొలి విడత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కొందరు ధిక్కార స్వరం వినిపించారు. అయినా పార్టీలోనే ఉన్నారు. కానీ వారు కండువాను విస్మరించారు. తద్వారా తమ నిరసనను పార్టీ నాయకుడికి చెప్పాలన్నదే వారి వ్యూహం అయి ఉండొచ్చు. కానీ కేసీఆర్ ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. “మీరు ఏం చేసినా కండువా వేసుకోండి. అదే మనకు గుర్తింపు. మీరు మర్చిపోయానని చెబితే కేసీఆర్ క్షమిస్తాడు, కానీ తెలంగాణ సమాజం క్షమించదు,” అని అన్నారు.

కట్ చేస్తే… తాజాగా కేసీఆర్ కుమార్తె కవిత కండువాను పక్కన పెట్టారు. గురువారం ఆమె మీడియాతో చిట్‌చాట్ చేసినప్పుడు కానీ, అదే సమయంలో కొందరు యువకులు తెలంగాణ జాగృతిలో చేరినప్పుడు కానీ, ఆమె వారికి జాగృతి జెండాలనే కప్పారు తప్ప, బీఆర్‌ఎస్ జెండాలను మెడలో వేయలేదు. తాను కూడా వేసుకోలేదు. వాస్తవానికి గులాబీ వర్ణంలో మెరిసిపోయే బీఆర్‌ఎస్ కండువాపై కేసీఆర్, కారు గుర్తులు ముద్రించి ఉంటాయి. వీటిని ధరించడం నాయకులు గౌరవంగా కూడా భావిస్తారు.

ఇక తాజాగా మంచిర్యాలలో పర్యటిస్తున్న సమయంలో కూడా కవిత బీఆర్‌ఎస్ కండువాను పక్కన పెట్టారు. ఆమె తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించినప్పుడు కానీ, యువకులతో ముచ్చటించేప్పుడు కానీ ఎక్కడా బీఆర్‌ఎస్ కండువా ఆమె మెడలో కనిపించలేదు. మరి ఆమె ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారా? లేక మరిచిపోయారా? అనేది చర్చగా మారింది. మరిచిపోయినా, ఉద్దేశపూర్వకంగా చేసినా… కేసీఆర్ గతంలో చెప్పినట్లు అది సీరియస్ మ్యాటరే. సో… ఏం జరుగుతుందో చూడాలి.