టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచి.. ఆ తర్వాత అధికార వైసీపీ పంచన చేరి లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడ్డ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజకీయ ప్రస్థానం ముగిసిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిన్నటి దాకా అసలు రాజకీయం అంటేనే ఏమిటో తెలియకుండా… బయటి ప్రపంచానికే కనంపించకుండా ఉండిపోయిన ఆయన సతీమణి పంకజశ్రీ ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమైపోయారన్న వార్త మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మేరకు శనివారం జరగనున్న గన్నవరం వైసీపీ నియోజకవర్గస్థాయి సమావేశానికి మాజీ మంత్రి పేర్ని నానితో పాటు పంకజశ్రీ కూడా హాజరు కానున్నారని, ఇందులోనే పంకజశ్రీ తన రాజకీయ రంగప్రవేశాన్ని ప్రకటిస్తారని సమాచారం.
గన్నవరం నియోజకవర్గంలో ఏడాదిగా అసలు వైసీపీ కార్యక్రమాలే జరిగిన దాఖలా లేదు. 2024 ఎన్నికల్లో తనతో పాటు వైసీపీ కూడా చిత్తుగా ఓడటంతో గన్నవరం వదిలిన వంశీ నియోజకవర్గం వైపే చూడలేదు. తాజాగా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనను పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేసి విజయవాడ తరలించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను బెజవాడ జిల్లా జైలుకు తరలించారు. వంద రోజులకు పైగా వంశీ ఈ జైల్లోనే ఉంటున్నారు. అయితే అప్పటికే పలు అనారోగ్య సమస్యలు ఉన్న వంశీ… జైలు జీవితం కారణంగా మరింత అనారోగ్యానికి గురయ్యారు. గుర్తు పట్టలేనంతగా ఆయన మారిపోయారు. జైలు నుంచి బయటకు వచ్చినా వంశీ రాజకీయాల్లో యాక్టివ్ గా పాలుపంచుకుంటారా? అన్న దానిపై అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి.
వంశీ ఆరోగ్య పరిస్థితి, ఆయనపై నమోదై ఉన్న కేసులు, వాటి తీవ్రత తదితర అంశాలన్నింటినీ పరిశీలించిన వైసీపీ అధిష్ఠానం వంశీ స్థానంలో పంకజశ్రీని రంగంలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని వంశీతో పాటు పంకజశ్రీకి చెప్పిన పార్టీ పెద్దలు… వారిని అందుకు ఒప్పించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు వంశీ తొలుత ఒప్పుకోకున్నా… ప్రస్తుత పరిస్థితులను ఆయన ముందు పెట్టగా అయిష్టంగానే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక పంకజశ్రీ తన భర్తను కేసుల నుంచి కాపాడుకునేందుకు తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఒక్కటే మార్గమన్న వైసీపీ నేతల వాదనలతో ఏమాత్రం ఆలోచించకుండానే ఒప్పేసుకున్నట్లు తెలుస్తోంది. విద్యావంతురాలైన పంకజశ్రీకి రాజకీయాలు కొత్తే అయినా.. పార్టీ మద్దతు ఉంటే రాణించే అవకాశాలున్నట్లు విశ్లేషణలు సాగుతున్నాయి.
వంశీని రిటైర్డ్ హర్ట్ చేసి… పంకజశ్రీని రంగంలోకి దింపే దిశగా వైసీపీ కూడా భారీ వ్యూహాన్నే రచించినట్టు సమాచారం. 2024 ఎన్నికలు ముగిసిన నాటి నుంచి గన్నవరంలో వైసీపీ పేరే వినిపించడం లేదు. అసలు పార్టీ కార్యాలయం తలుపులు తీస్తున్నారో, లేదో కూడా తెలియదు. వంశీతో పాటు ఆయన ముఖ్య అనుచరులంతా కేసుల్లో ఇరుక్కుని అరెస్టు కావడమో..లేదంటే పరారీలో ఉండటమో చేస్తున్నారు. ఈ కారణంగా అసలు వైసీపీ మాటే గన్నవరంలో వినిపించడం లేదు. ఇలాంటి క్రమంలో వంశీ అనుచర గణమంతా ఇప్పటికే టీడీపీ బాట పడుతున్నారు. ఈ వలసలను ఆపాలంటే… నియోజకవర్గంలో ఎవరినో ఒకరిని రంగంలోకి దించాలి. అది వంశీ కుటుంబం నుంచి… ఆయన సతీమణి పంకజశ్రీ అయితే మరీ మంచిదన్న వాదనతోనే ఈ వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది.