బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసే దిశగా కుట్రలు జరిగాయని, తాను జైల్లో ఉన్నప్పుడే ఈ కుట్రలు జరిగాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా విరుచుకు పడింది. గురువారం కవిత చేసిన వ్యాఖ్యలకు పలువురు నేతల నుంచి తక్షణ స్పందన కనిపించింది. తాజాగా శుక్రవారం మెదక్ ఎంపీ మాధవనేని రఘనందన్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కవితపైనా, బీఆర్ఎస్ తీరుపైనా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కవితను ఆయన ఏకంగా చెల్లని దుడ్డుగా, చెల్లని రూపాయిగా అభివర్ణించారు. తాను చెల్లని దుడ్డుగా మారిన నేపథ్యంలో తనను తాను బ్రాండింగ్ చేసుకునేందుకు కవిత ఈ తరహా అసత్య ఆరోపణలకు దిగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని చెబుతున్న కవిత… తనకు గానీ, తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ కు గానీ పెద్దగా గుర్తింపు లేదన్న విషయాన్ని గుర్తించినట్లు ఉన్నారని రఘునందన్ రావు అన్నారు. తనతో పాటు తన సోదరుడు కేటీఆర్ కూడా నిత్యం లైమ్ లైట్ లో ఉండే దిశగానే అన్నాచెల్లెల్లు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయినా ఓ ఎమ్మెల్సీగా, ఓ మాజీ ఎంపీగా ఉన్న కవిత ఏదైనా చెప్పదలచుకుంటే…నేరుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సింది పోయి… ఈ చిట్ చాట్ లు ఏమిటని ప్రశ్నించారు. చిట్ చాట్ లలో మాట్లాడితే… ఏదైనా తనకు ఇబ్బందికరం అయిన విషయం పత్రికలు రాస్తే.. తాను ఆ విషయాన్ని అనలేదని, మీడియానే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుందని కవరింగ్ చేసుకోవచ్చన్న బావనతోనే కవిత చిట్ చాట్ లను ఆశ్రయించారని ఆరోపించారు.
తెలంగాణను పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ కు ఇప్పుడు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని మాధవనేని పంచ్ డైలాగులు విసిరారు. తమ పాలనలో 30 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నా తమకు మైలేజీ రాలేదని బావించిన కేటీఆర్, కవితలు ఇప్పడు విదేశాల్లో తప్పుడు ఐపీ అడ్రెస్ లతో యూట్యూబ్, వెబ్ సైట్లను పెట్టుకుని తమను తాము ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఐధేళ్ల పాటు నిజామాబాద్ ఎంపీగా ఏమీ చేయలేని కారణంగానే ఆ మరుసటి ఎన్నికల్లోనే ఓడించారని గుర్తు చేశారు. అయినా తెలంగాణ సాకారం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరవీరులకు బీఆర్ఎస్ గానీ, కవిత గానీ ఏనాడైనా పట్టించుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలన అంతా దోపిడీలతో సాగిందని ఆయన ఆరోపించారు.