వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ఎట్టకేలకు గురువారం భారీ ఊరట దక్కిందని చెప్పక తప్పదు. దాదాపుగా వంద రోజులకు పైగా జైల్లో ఉన్న కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైన వంశీ…చికిత్స చేయించుకునేందుకు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు… వైద్య చికిత్సల నిమిత్తం వంశీకి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. అంతేకాకుండా విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలోనే చికిత్స అందించాలని కూడా పోలీసులను కోర్టు ఆదేశించింది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి వంశీపై కేసు నమోదు కాగా… ఈ కేసును ఎలాగైనా మాఫీ చేసుకునే యత్నాలకు దిగిన వంశీ… కేసు ఫిర్యాదుదారుడిగా ఉన్న దళిత యువకుడు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి అడ్డంగా డొరికిపోయారు. కిడ్నాప్ కేసులో వంశీని హైదరాబాద్ వెళ్లి మరీ అరెస్టు చేసి విజయవాడ తీసుకువచ్చిన పోలీసులు కోర్టు ఆదేశాలతో బెజవాడ జైలుకు తరలించారు. నాటి నుంచి పలు పాత కేసులు, కొత్త కేసులు కూడా వంశీపై నమోదు అవుతూ వచ్చాయి. ఫలితంగా ఓ కేసులో బెయిల్ వచ్చినా… మరో కేసులో రిమాండ్ పడుతూ వచ్చింది.
ఈ క్రమంలో అప్పటికే తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వంశీ… జైలు జీవితం కారణంగా మరింతగా అనారోగ్యం బారిన పడ్డారు. మనిషి పూర్తిగా ఫేడ్ అవుట్ అయిపోయారు. గుర్తు పట్టలేనంతగా ఆయన మారిపోయారు. నడవడానికి కూడా ఇబ్బంది పడిన సందర్భాలు లేకపోలేదు. ఈ క్రమంలో నకిలీ పట్టాల కేసులో పోలీసు కస్టడీకి వెళ్లిన వంశీ పోలీస్ స్టేషన్ లోనే అనారోగ్యానికి గురి అయ్యారు. అప్పటికప్పుడు పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
తాజాగా తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందని, తక్షణమే చికిత్స తీసుకుంటే తప్పించి తాను కోలుకోలేనని… ఈ కారణంగా వైద్యం చేయించుకునేందుకు తనకు బెయిల్ ఇవ్వాలంటూ వంశీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం పొద్దున్నే కోర్టు విచారణ చేపట్టింది. అందుబాటులోని ఆసుపత్రిలో వంశీకి చికిత్స అందించాలని కోర్టు ఆదేశించింది. అయితే తనకున్న అనారోగ్య సమస్యలకు అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవని వంశీ కోర్టుకు తెలిపారు. మరి ఏ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారని కోర్టు ప్రశ్నించగా… ఆయుష్ ఆసుపత్రి పేరు చెప్పగా.. అందుకు సరేనన్న కోర్టు చికిత్స నిమిత్తం వంశీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే… అక్రమ మైనింగ్ కేసులో కోర్టు వంశీకి ముదస్తు బెయిల్ మంజూరు చేసింది.