=

కేసీఆర్‌ను శాసిస్తారా? – క‌విత వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నాయకులు

బీఆర్ఎస్ మేలు కోరుకుంటున్నాను.. మా నాయ‌కుడుగా కేసీఆర్‌ను మాత్ర‌మే చూస్తున్నాన‌ని చెప్పిన క‌విత‌.. త‌న మాటల ద్వారా అదే కేసీఆర్‌ను రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ ఇరుకున పడేశారా?  ఆయ‌న స‌మాధానం చెప్పుకొనే ప‌రిస్థితికి క‌విత తీసుకువ‌చ్చారా? అంటే.. బీఆర్ ఎస్ నాయ‌కులు అదే మాట అంటున్నారు. తాజాగా క‌విత చేసిన వ్యాఖ్య‌లు.. పార్టీలోను.. కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితంగా ఉన్న కొంద‌రు నాయ‌కుల్లోనూ చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

క‌విత చేసిన వ్యాఖ్య‌ల్లో ముఖ్యంగా రెండు అంశాల‌ను వారు ప్ర‌స్తావిస్తున్నారు. 1)  బీజేపీలో బీఆర్ ఎస్‌ను విలీనం చేయ‌డం అనే ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని చెప్ప‌డం. దీనిని నాయ‌కులు తీవ్రంగానే ప‌రిగ‌ణిస్తున్నారు. ఇది పూర్తిగా పార్టీలో అంత‌ర్గ‌త అంశ‌మ‌ని.. దీనిని బ‌య‌ట‌కు చెప్ప‌డం స‌రికాద‌ని ముక్త‌కంఠంతో చెబుతున్నారు. “ఆమె కూడా మా నాయ‌కురాలే. ఆమెకు బాధ ఉండొచ్చు. కానీ, అది వ్య‌క్తిగ‌తం. క‌లిసి కూర్చుని మాట్లాడుకుంటే స‌రిపోయేది. కానీ.. ఇప్పుడు అంత‌ర్గ‌త విష‌యాలు బ‌య‌ట‌కు చెప్పి. పార్టీని నాలుగు రోడ్ల కూడ‌లిలో నిల‌బెట్టారు.“ అని కీల‌క నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు.

మ‌రొక‌రు..“ క‌విత‌, కేటీఆర్‌లు పార్టీలు న‌డ‌ప‌డం లేదు. ఇప్పుడు కేసీఆర్ బాధ్యుడు. ఆయ‌న గౌర‌వం మాకు ముఖ్యం. బీజేపీతో చేతులు క‌ల‌పాల్సిన అవ‌స‌రం లేదు. ఏదైనా ఉంటే.. వాటిపైనే క‌విత మాట్లాడాల్సి ఉంది. కానీ.. నాలుగు గోడ‌ల‌మ‌ధ్య చ‌ర్చించుకునే విష‌యాలు బ‌య‌టకు ఎలా చెబుతుంది. ఇది త‌ప్పు. ఇదే కొన‌సాగితే.. మాకు కూడా ఎన్నో విష‌యాలు చెప్పారు. అన్నీ బ‌య‌ట పెడితే పార్టీ ఉంటుందా?“ అని హైద‌రాబాద్‌కు చెందిన మాజీ మంత్రి, బీసీ నాయ‌కుడు ఒక‌రు  వ్యాఖ్యానించారు.

ఇక‌, రెండో విష‌యం.. నాయ‌కుడిగా కేసీఆర్‌ను త‌ప్ప‌.. మ‌రొక‌రిని అంగీక‌రించేది లేద‌ని క‌విత చెప్ప‌డం. దీనిపైనా బీఆర్ ఎస్ నాయ‌కులు.. గుస్సాగా ఉన్నారు. “నాయ‌కుడిగా కేసీఆర్‌ను అంగీక‌రించిన‌ప్పుడు.. ఆయ‌న మాట‌ను కూడా అంగీక‌రించాల‌ని చెబుతున్నారు. ఆయ‌నకు విలువనిస్తున్నామంటే.. ఆయ‌న ఏం చేసినా అంగీక‌రించాలి క‌దా! మ‌న ఇష్టం వ‌చ్చిన‌ట్టు కేసీఆర్‌ను న‌డ‌వ‌మ‌ని చెప్ప‌లేం. అలా అనుకుంటే.. పార్టీలో 2 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. వేలాది మంది నాయ‌కులు ఉన్నారు. అంద‌రూ కేసీఆర్‌ను శాసిస్తే.. ఎలా?  ఇది త‌ప్పు. క‌విత హ‌ద్దులు మీరుతున్నారు.“ ఖ‌మ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించారు.

మొత్తానికి క‌విత వ్య‌వ‌హారం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు సింప‌తీ వైపు మ‌ళ్లినా.. ఇప్పుడు అంత‌రంగిక విష‌యాలు బ‌య‌టకు చెప్ప‌డం, కేసీఆర్‌ను శాసించేలా ఆమె వ్యాఖ్యానించ‌డాన్ని సీనియ‌ర్లు త‌ప్పుబ‌డుతున్నారు. మ‌రి వీరంతా ఏం చేస్తారో.. చూడాలి.