=

3 రోజుల్లో ఇండియాకు రావాల్సిందే: ప్ర‌భాక‌ర్ రావుకు సుప్రీం కోర్టు ఆదేశం

తెలంగాణ‌లో బీఆర్ ఎస్ పార్టీ హ‌యాంలో జ‌రిగిన‌ ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక న‌మోదైన ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడుగా.. అప్ప‌టి ఐపీఎస్ అధికారి.. స్పెష‌ల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా ప‌నిచేసిన ప్ర‌భాక‌ర్‌రావు ఉన్నారు. అయితే.. కేసు న‌మోదు అవుతుంద‌ని తెలిసిన ఆయ‌న వెంట‌నే.. అమెరికాకు వెళ్లిపోయారు. కానీ.. కేసులో మాత్రం ఆయ‌న‌ను ఏ-1గా పేర్కొన్నారు.

అప్ప‌టి నుంచి ప్ర‌భాక‌ర్ రావును తెలంగాణ‌కు తెప్పించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కానీ, ఆయ‌న మాత్రం రావ‌డంలేదు. ఈ లోగా ముంద‌స్తు బెయిల్ కోసం ఆయ‌న ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. గ‌తంలో ఆయా పిటిష‌న్ల‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో కొన్నాళ్ల కింద‌ట సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి.. ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. తాజాగాదీనిపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల్లోగా తెలంగాణ‌కు వ‌చ్చేయాల్సిందేన‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అంతేకాదు.. విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కూడా ప్ర‌భాక‌ర్ రావుకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. “కీల‌క‌మైన అధికారులుగా ప‌నిచేసిన వారు ఇలా త‌ప్పించుకుని వెళ్లిపోవ‌డాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. మ‌న చ‌ట్టాలు అంత క‌ఠినంగా ఉన్నాయా?“అని న్యాయ‌మూర్తి ఒక‌రు వ్యాఖ్యానించారు. మూడు రోజుల్లోనే భార‌త్‌కు తిరిగి రావాల‌న్న కోర్టు.. విచార‌ణ అధికారుల‌కు స‌హ‌క‌రించాల‌ని సూచించింది. అంతేకాదు.. తెలంగాణ ప్ర‌భుత్వానికి కూడా కొన్ని సూచ‌న‌లు చేసింది.

ప్ర‌భాక‌ర్‌రావుపై ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని, థ‌ర్డ్ డిగ్రీ వంటివి ప్ర‌యోగించ‌డం.. దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంవంటివి చేయొద్ద‌ని పేర్కొంది. ఇదేస‌మ‌యంలో ఆయ‌న‌కు `తాత్కాలిక ముందస్తు బెయిల్‌`ను మంజూరు చేసింది. అలాగే పాస్ పోర్ట్ ఇవ్వాల‌ని ఆదేశించింది. అంతేకాదు.. మూడు రోజుల్లో భార‌త్‌కు తిరిగి వ‌స్తాన‌ని లిఖిత పూర్వ‌కంగా కోర్టుకు స‌మ‌ర్పించాల‌ని సంబంధిత న్యాయ‌వాదిని ఆదేశించింది. ఇక‌, ముంద‌స్తు బెయిల్ విష‌యంపై త‌ర్వాత విచార‌ణ జ‌రుపుతామంది.