టైం ఇవ్వాలి.. బాబు వినాలి.. లేక‌పోతే.. !

ఏ పార్టీలో అయినా.. నాయ‌కుల‌కు సంతృప్తి-అసంతృప్తి అనేవి రెండూ ఉంటాయి. రెండు ఉన్న వారు కూడా ఉంటారు. ఎంత చేసినా అసంతృప్తేనా? అనే మాట హైక‌మాండ్ నుంచి వినిపిస్తుంది. కానీ ఎంతో చేస్తున్నాం.. అయినా త‌మ‌కు గుర్తింపు లేద‌ని క్షేత్ర‌స్తాయిలో నాయ‌కులు అంటారు. ఈ రెండు ఏ పార్టీలో అయినా కామ‌నే. అయితే.. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం ఉన్న టీడీపీలో ఇప్పుడు.. మ‌రింత ఎక్కువ‌గా ఈ మాట వినిపిస్తోంది.

మ‌రొ మూడో రోజుల్లో మ‌హానాడు మొద‌లు కానుంది. వ‌చ్చే నాలుగేళ్ల‌కు స‌రిప‌డా ప్లాన్‌ల‌ను.. వ‌చ్చే ఎన్నికలకు ర‌హ‌దారుల‌ను కూడా ఈ మ‌హానాడు వేదిగా పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు వేయ‌నున్నారు. అయితే.. భ‌విష్య‌త్తు ఎలా ఉన్నా.. ఇప్పుడు క్షేత్ర‌స్థాయిలో 72 నియోజ‌క‌వ‌ర్గాల్లో నిర్వ‌హించిన మినీ మ‌హానాడులు నాయ‌కుల అసంతృప్తిని స్ప‌ష్టం చేసింది. దీనిలో ప్ర‌ధానంగా చంద్ర‌బాబును క‌లుసుకునే అవ‌కాశం లేకుండా పోయింద‌ని ఎమ్మెల్యేలే వ్యాఖ్యానిస్తున్నారు.

అంతేకాదు.. త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు.. తాము ఎదుర్కొంటున్న రాజ‌కీయాల‌ను వివ‌రించేందుకు నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధినిధుల‌ను రాబ‌ట్టుకునేందుకు కూడా తాము ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. ఒక‌రు ఇద్ద‌రు అయితే.. ఓకే. కానీ, ప‌దుల సంఖ్య‌లో ఎమ్మెల్యేలు.. సీఎంను క‌లుసుకునేందుకు ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని చెబుతున్నారు. పోనీ.. ఇలా చెబుతున్న వారు జూనియ‌ర్లు కూడా కాదు. వీరిలో సీనియ‌ర్లే ఉన్నారు.

బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి, జ్యోతుల నెహ్రూ. గ‌ద్దె రామ్మోహ‌న్ ఇలా.. చెప్పుకొంటూ పోతే చాలా మంది ఉన్నారు. వీరంద‌రి ఆవేద‌న, అసంతృప్తి కూడా.. చంద్ర‌బాబు త‌మ‌కు అప్పాయింట్‌మెంట్ ఇవ్వ‌డం లేద‌ని.. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేప‌ట్ట‌లేక పోతున్నామ‌నే. సో.. ఇది పెర‌గ‌కుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం.. బాధ్య‌త కూడా సీఎం చంద్ర‌బాబుపైనే ఉంది. కాబ‌ట్టి.. ఆయ‌న వీరికి టైం ఇవ్వాల్సిన‌.. వారి మాట వినాల్సిన అవ‌స‌రం రెండూ ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.