వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం కాదు. ఉగాది సందర్భంగా పంచాగ కర్త చెప్పిన మాటలివి. ఉగాది వేడుకలలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు పండితులు, సిద్దాంతులతో పంచాంగ శ్రవణం చదివించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్సతీసమేతంగా ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. భాస్కరభట్ల సిద్దాంతి పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ సందర్భంగా పంచాగకర్త ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రాలతో వివాదాల కారణంగా కూటమి నాయకులు ప్రజల్లో అపకీర్తి తెచ్చుకుంటారని అన్నారు.

ప్రతిపక్షంలో ఉన్న వారు మరింత బలవంతులవుతారని జోస్యం చెప్పారు. ప్రభుత్వంలో మార్పులు ఉంటాయని, మంత్రులు శాఖలు మారతాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు రావచ్చన్నారు. అయితే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై పొగడ్తలు గుప్పించడం విశేషం. అది సుస్థిరమైన పాలనను ఇస్తుందన్నారు. విశేషమైన కీర్తిని కూడా పొందగలుగుతుందని తెలిపారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు రావచ్చని చెప్పడమే ఇక్కడ గమనార్హం.