పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక అనుచరులను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేసిన ముని తుకారాం, మరో కీలక అనుచరుడు మాధవరెడ్డిని తిరుపతి జిల్లా మదనపల్లెలో అరెస్టు చేశారు. అనంతరం వారిని విజయవాడకు తరలించారు.

ఏంటి కేసు?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 జూలై 21న మదనపల్లెలోని ఆర్డీవో కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కీలకమైన ఫైళ్లు తగలబడ్డాయి. దీనిపై అనుమానాలు వ్యక్తమవడంతో ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. అప్పటి డీజీపీ ద్వారకాతిరుమల రావు స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు కూడా ఘటన స్థలాన్ని సందర్శించారు.

వైసీపీ హయాంలో మదనపల్లె ప్రాంతంలోని డీకేటీ, అసైన్డ్ భూములను పరిధి నుంచి తొలగించి పెద్దిరెడ్డి తన బినామీలకు కట్టబెట్టారన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారం బయటపడే అవకాశం ఉండటంతోనే అగ్నిప్రమాదం సృష్టించారని అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఘటనపై చర్యగా రెవెన్యూ అధికారులు సహా డిప్యూటీ కలెక్టర్‌ను సస్పెండ్ చేశారు.

ఈ కేసులో పెద్దిరెడ్డి సహా ఆయన కుటుంబాన్ని పలుమార్లు విచారించారు. పెద్దిరెడ్డి అనుచరులైన ముని తుకారాం, మాధవరెడ్డిపై ఏ3, ఏ4 కింద కేసులు నమోదు అయ్యాయి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా విఫలమయ్యారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.