వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్ను ఉద్దేశించి కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక మైన ఐదు ప్రశ్నలు సంధించారు. ఒకరకంగా చెప్పాలంటే.. ఇటీవల కాలంలో జగన్పై విమర్శలకు దూరంగా ఉన్న షర్మిల.. ఆ గ్యాప్ను తాజాగా భర్తీ చేసేశారు. తాజాగా జగన్పై షర్మిల నిప్పులు చెరుగుతూ పలు ప్రశ్నలు సంధించారు.
ఏపీలో లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీ స్ను తలపిస్తోందన్న ఆమె దీంతో వైసీపీకి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. భయాలను అడ్రెస్ చేయడానికి, సెక్యూరిటీ కల్పించడానికి ఇప్పుడు జగన్ మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు. జగన్ ఒకప్పటి ముఖ్యమంత్రి అని, ఇలాంటి వ్యక్తి పోలీసుల మీద మాట్లాడిన తీరు బాధాకరమని వ్యాఖ్యానించారు. “వారి బట్టలు ఊడదీస్తాడట. తరిమి తరిమి కొడతాడట. విదేశాల్లో ఉన్నా పట్టుకుంటాడట“ అని వ్యాఖ్యానించారు.
సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసన్న షర్మిల.. ఆ వ్యవస్థను నాశనం చేసింది నువ్వు కాదా? అని నిలదీశారు. ఈ విషయాన్ని రఘురామ కృష్ణరాజుని అడిగినా, ముంబై నటి కాదంబరి జెత్వానీని అడిగిగా చెబుతారని అన్నారు. నాడు మీకోసం వాడుకొని ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడటం కరెక్టేనా? అని నిలదీశారు. లిక్కర్ లో అవినీతి జరిగింది అని జగన్ మీద ఆరోపణలు ఉన్నాయన్న ఆమె.. వైఎస్ బిడ్డగా మీరు ఎందుకు దాక్కుంటున్నారని ప్రశ్నించారు.
అసెంబ్లీకి ఎందుకు వెళ్లడంలేదో మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని షర్మిల కోరారు. లిక్కర్ కుంభకోణంపై విచారణ కోరండని నిలదీశారు. తప్పు లేకపోతే ఉరి తీయమని కోరాలని డిమాండ్ చేశారు. అలా అడకపోతే.. మీరు తప్పు చేశారని ఒప్పుకొన్నట్టేనని అన్నారు. మీరు అవినీతి చేశారని అర్థం అవుతుందన్నారు. మీ వైసీపీ హయంలో లిక్కర్ అమ్మకాల్లో డిజిటల్ పే మెంట్ ఎందుకు లేదో సమాధానం చెప్పండి.. అని ప్రశ్నించారు. వచ్చిన ఆదాయం ఎక్కడకు పోయిందో వెల్లడించాలని నిలదీశారు.