ఏపీలో ఫ‌స్ట్ క‌రోనా కేసు.. సీఎం రియాక్షన్ ఇదే!

2019-21 మ‌ధ్య రెండు మూడు ద‌శ‌లుగా విస్త‌రించి.. ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను హ‌రించిన క‌రోనా ప్ర‌స్తుతం మ‌రోసారి ప్ర‌పంచ దేశాల‌కు స‌వాల్ రువ్వుతోంది. ప్ర‌స్తుతం ఐదారు దేశాల్లో క‌రోనా కేసులు పెరిగాయి. ఇది బ‌ల‌మైన క‌రోనా వైర‌స్ రూపాంత‌ర‌మా? లేక సాధార‌ణంగా పోతుందా? అనే దానిపై ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతు న్నాయి. ఇదిలావుంటే.. తాజాగా ఏపీలో తొలి క‌రోనా పాజిటివ్‌ కేసు న‌మోదైంది. విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలోని ఓ కాలనీకి చెందిన వివాహతకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

దీనిని ప్ర‌భుత్వం అధికారికంగానే ప్ర‌క‌టించింది. ఆమెతోపాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వ‌హించ‌గా.. వారికి కూడా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదే విష‌యాన్ని ప్ర‌భుత్వం కూడా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఆసుపత్రిలో ఉన్న కుటుంబాన్ని ప‌లు జాగ్ర‌త్త‌ల‌తో డిశ్చార్జ్ చేసి వారం రోజులు పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. ఇక‌, కోవిడ్ 19 పాజిటివ్ కేస్ వచ్చిన పరిసర ప్రాంతాల్లో మూడు టీంలతో ఇంటింటికి సర్వే చేయడంతో పాటు చుట్టుపక్కల వారందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్ర‌భుత్వం ఆదేశించింది.

మ‌రోవైపు.. కరోనా వైరస్ పాజిటివ్ కేసు న‌మోదైన నేప‌థ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. పెద్ద ఎత్తున గుంపులుగా గుమి గూడవ‌ద్ద‌ని సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్స్, ఎయిర్ పోర్టులు, కోవిడ్- 19 నియమావళిని పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది. రద్దీ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, 60 ఏళ్లు దాటిన వారు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండాల‌ని కోరింది. దగ్గినా లేదా తుమ్మినప్పుడు చేతులు అడ్డుపెట్టుకోవాలని, చేతులు సబ్బుతో కడుక్కోవాలి సూచించింది. ఈ మేర‌కు వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక సూచ‌న‌ల‌తో ఒక నోట్ విడుద‌ల చేసింది.

మ‌రోవైపు.. క‌రోనా కేసు న‌మోదైన నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని.. కేంద్ర ప్ర‌భుత్వం సూచించే గైడ్ లైన్స్‌ను త‌ప్ప‌కుండా పాటించాల‌ని పేర్కొన్నారు. అవ‌స‌ర‌మైతే.. వైద్యుల సెల‌వుల‌ను ర‌ద్దు చేయాల‌ని సూచించారు.