జగన్ గురుతులు చెరిగిపోతున్నాయి

రాష్ట్రంలో వైసీపీ హ‌యాంలో ప్ర‌జ‌ల‌కు పాల‌న‌ను చేరువ చేసేందుకు ప‌లు ప‌థ‌కాల‌ను అప్ప‌టి సీఎం జ‌గ‌న్ తీసుకువ‌చ్చారు. అయితే.. ప్ర‌భుత్వం మారితే.. పాల‌న మారుతుంద‌న్న‌ట్టుగా.. రాష్ట్రంలో ప‌రిస్థితులు కూడా మారుతున్నాయి. గ‌త వైసీపీ ప్రాభ‌వం ఇప్పుడు త‌గ్గుతోంది. గ‌తంలో అన్నా క్యాంటీన్ల‌ను జ‌గ‌న్ నిలిపివేసి.. చంద్ర‌బాబు పేరును రాకుండా.. లేకుండా చేయాల‌ని ప్ర‌య‌త్నించారు. ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలోనూ ఇలానే వ్య‌వ‌హ‌రించారు.

ఈ ప‌రిణామాలు .. టీడీపీని బాధించినా.. లేకున్నా.. పేద‌ల‌కు మాత్రం అన్నా క్యాంటీన్ల‌ను ఎత్తేయ‌డం శ‌రాఘాతంగా మారింది. ఇది ఎన్నిక‌ల స‌మ‌యానికి వైసీపీకి శాపంగా ప‌రిణ‌మించింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు కూడా కూట‌మి స‌ర్కారు వైసీపీ ముద్ర చెరిపేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అయితే.. అలా చేస్తున్న ప్ర‌తిసారీ.. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ.. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా చేస్తుండ‌డంతో వైసీపీ హ‌యాంలో అమ‌లైన కార్యక్ర‌మాలు ఇప్పుడు లేక‌పోయినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య పెద్ద‌గా చ‌ర్చ అయితే ఉండ‌డం లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను ప‌క్క‌న పెట్టారు. దీని స్థానంలో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ను తీసుకువ‌చ్చారు. త‌ద్వారా ప్ర‌భుత్వ సేవ‌ల‌ను.. ప్ర‌జా ఫిర్యాదుల‌ను కూడా ఫోన్‌లోనే న‌మోదు చేసుకునే కొత్త వ్య‌వ‌స్థ‌ను తీసు కువ‌చ్చారు. ఇక‌, ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యేందుకు.. ప్ర‌జాద‌ర్బార్‌లు, గ్రీవెన్సును కూడా చేప‌డుతున్నారు. త‌ద్వారా ప్ర‌జ‌ల్లో వైసీపీ కార్య‌క్ర‌మాలు లేవ‌న్న చ‌ర్చ రాకుండా చేస్తున్నారు. అలాగే.. స‌చివాల‌యాల్లో నూ ప‌నితీరును మార్చారు. కానీ.. అక్కడ ప‌రిష్కార‌మ‌య్యే స‌మ‌స్య‌ల‌ను నేరుగా ప్ర‌భుత్వ‌మే ప‌రిశీల‌న చేస్తోంది.

ఇక‌, తాజాగా ఇంటింటికీ రేష‌న్ పంపిణీ చేసే వాహ‌నాల‌ను కూడా తీసేస్తున్న‌ట్టు స‌ర్కారు ప్ర‌క‌టించింది. దీంతో స‌హ‌జంగానే స‌ర్కారుపై అసంతృప్తి ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని అనుకున్నా.. ఆ వెంట‌నే స‌ర్కారు స‌రిచేసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు ఎక్కువ‌గా ఉన్న చోట్ల నేరుగా వాహ‌నాల‌ను పంపించ‌ను ట్టు పేర్కొంది. త‌ద్వారా… వైసీపీ ముద్రను చెరిపేస్తున్నా.. దాని తాలూకు ఎఫెక్ట్ మాత్రం త‌మ‌పై ప‌డ‌కుండా చూసుకునే విష‌యంలో ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం.