కిలోల కొద్దీ బంగారం ఎందుక్కొన్నారు రెడ్డిగారు

ఏపీలో ఇప్పుడు మద్యం కుంభకోణంపై పెద్ద చర్చే నడుస్తోంది. అన్ని కేసుల కంటే కూడా ఈ కేసే ఇప్పుడు ప్రదాన కేసుగా మారిపోయింది. రాజకీయ నేతల అరెస్టులు తప్పించి… దాదాపుగా అన్ని రకాలుగా ఈ కేసు సంచలనాలకే కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ఇలాంటి ఈ కేసు ఓ కీలక అదికారి అత్యుత్సాహం, హైరానా, ఆదుర్దా కారణంగా బయటపడిపోయిందన్న విషయం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏపీ బీవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీబీసీఎల్) ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి అతి జాగ్రత్త వల్లే ఈ కుంభకోణం బయటపడిపోయిందని తాజాగా తేలింది.

వాస్తవంగా ఓ పార్టీ ప్రభుత్వం అదికారం నుంచి దిగిపోతే… ఆ సమయంలో తన అక్రమాలు బయటపడకుండా ఉండేలా పలు పత్రాలను మాయం చేస్తూ ఉంటుంది. ఇటీవలి కాలంలో ఈ తరహా యత్నాలు బాగానే పెరిగిపోయాయి. అయితే ఏదో గుట్టు చప్పుడు కాకుండా జరగాల్సిన కార్యక్రమాలను వాసుదేవరెడ్డి హైరానా పడిపోయి… దాదాపుగా తన కార్యాలయాన్నే ఆయన ఊడ్చేసే యత్నం చేశారు. అప్పటికే మద్యం విక్రయాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించిన కూటమి పార్టీలు అదికారంలోకి వచ్చాక ఇంత జరుగుతూ ఉంటే ఊరకే కూర్చోవు కదా.

ఏపీబీసీఎల్ లో కీలక పత్రాలను మాయం చేస్తున్నారంటూ వాసుదేవరెడ్డిపై కూటమి సర్కారు కేసు నమోదు చేసింది. అప్పటికే వాసుదేవరెడ్డి పత్రాలను మాయం చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు వాసుదేవరెడ్డి కారు, ఇల్లు, కార్యాలయం తదితరాలను సోదా చేశారు. ఈ సోదాల్లో కిలోల కొద్దీ బంగారం కొనుగోలు చేసిన రషీదులు కొన్ని బయటపడ్డాయట. అదేంటీ… బంగారం అయితే ఏ గ్రాముల లెక్కనో, తులాల లెక్కనో కంటారు గానీ… వీళ్లేంటీ ఏకంగా కిలోల లెక్కన కొన్నారంటూ మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవమే అని ఆధారాలతో సహా బయటపడిపోయింది.

వాస్తవానికి వాసుదేవరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అదికారి కాదు. కేంద్ర సర్వీసు అయిన ఐఆర్టీఎస్ కు చెందిన అదికారి. వైసీపీ అదికారంలోకి రాగానే… జగన్ ఆయనను డిప్యూటేషన్ మీద ఏపికి తీసుకువచ్చి ఏపీబీసీఎల్ ఎండీగా కీలక పోస్టింగ్ ఇచ్చారు. ఇంకేముంది పిలిచి మరీ ఇంతటి కీలక పోస్టు ఇస్తే… జగన్ చెప్పినట్టు చేయక చస్తారా? అందులోనే తన సామాజిక వర్గానికి చెందిన నేత తనను నమ్మారంటూ మరింత జోరుగా దందాను సాగించారు. తీరా ప్రభుత్వం పడిపోయాక తన గురువును రక్షించేందుకు ఆయన పడరాని పాట్లు పడ్డారు. ఆ పాట్లతోనే ఆయన మొత్తం ముఠాలోని సభ్యులను అడ్డంగా బుక్ చేసి పారేశారు.