పార్టీ గీత దాటితే లోకేశ్ ఊరుకోరుగా!

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అంటేనే… ఓ క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీ అదినాయకత్వం మాటే ఆ పార్టీ శ్రేణులకు శిరోధార్యం. పార్టీ లైన్ దాటి ప్రవర్తించే నేతల సంఖ్య టీడీపీలో చాలా తక్కువేనని చెప్పాలి. అసలు అలాంటి వారి సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చని, వారిపైనా పార్టీ అధినాయకత్వం తీసుకునే చర్యలను చూసి… ఇతర నేతలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. మొత్తంగా ఇతర పార్టీల మాదిరిగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలు టీడీపీలో పెద్దగా కనిపించరు. అలాంటిది సోమవారం గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కి చెందిన టీడీపీ కార్పొరేటర్లు పార్టీని డైలమాలో పడేశారు. అధినాయకత్వానికి కోపం తెప్పించారు. ఫలితం అనుభవించేందుకు సిద్ధం కాక తప్పలేదు.

అసలు జీవీఎంసీలో సోమవారం ఏం జరిగిందన్న విషయానికి వస్తే… వైసీపీ జమానాలో జరిగిన ఎన్నికల్లో జీవీఎంసీ పీఠాన్ని ఆ పార్టీనే దక్కించుకుంది. అయితే కూటమి అధికారం చేపట్టిన తర్వాత పలు నాటకీయ పరిణామాల నేపథ్యంలో కూటమి జెండా జీవీఎంసీపై ఎగిరింది. జీవీఎంసీ మేయర్ గా టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవికి సోమవారం ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలో కూటమి కీలక భాగస్వామి అయిన జనసేనకు కేటాయించారు. మేయర్ పదవి టీడీపీకి దక్కగా… జనసేనకు డిప్యూటీ దక్కడం పొత్తు ధర్మమే కదా. ఇక్కడిదాకా అంతా బానే ఉన్నా…సరిగ్గా ఎన్నిక జరగాల్సిన సోమవారం రోజున కోరానికి సరిపడ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో అనివార్యంగా డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది.

వాస్తవానికి జీవీఎంసీలో కూటమికి దాదాపుగా 74 మందికిపైగా బలం ఉంది. అందులో కేవలం 56 మంది సభ్యులు హాజరైతే డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగిపోయి ఉండేది. అయితే సోమవారం నాటి ఎన్నికకు కేవలం 54 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో కోరంలేని కారణంగా డిప్యూటీ మేయర్ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు రిటర్నింగ్ అదికారి ప్రకటించారు. ఇలా డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిందో, లేదో… ఆ సమాచారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ చెవిన పడింది. వెంటనే ఆయన పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఏం జరిగిందని ఆరా తీశారు.

ఆ తర్వాత మరిన్ని వర్గాల ద్వారా కోరానికి సరిపడ సభ్యులు సమావేశానికి ఎందుకు హాజరు కాలేదన్న దానిపై లోకేశ్ వివరాలు సేకరించారు. డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడం కొందరు టీడీపీ నేతలకు నచ్చలేదన్న వాదనలు కూడా అందులో వినిపించాయట. ఇక సోమవారం నాటి సమావేశానికి గైర్హాజరు అయిన వారిలో కార్పొరేటర్లతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. ఈ జాబితాను ముందేసుకుని పరిశీలించిన లోకేశ్… వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పల్లాకు ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. పొత్తు అన్నాక మిత్రధర్మాన్ని పాటించాల్సిన అవసరాన్ని గుర్తించాల్సిన నేతలు… ఇలా వ్యవహరిస్తే సహించేది లేదని కూడా లోకేశ్ ఒకింత సీరియస్ గానే పల్లాకు క్లాస్ పీకినట్లు సమాచారం.