అనిల్ వ్యూహమేంటి?.. దాడినా?, ఆత్మరక్షణా?

మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఎక్కడో నెల్లూరు జిల్లా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చి తొడకొట్టి మరీ ఓడిపోయిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ మొన్నటిదాకా పత్తా లేకుండా పోయారు. ఏమైందో తెలియదు గానీ… ఇటీవలే అజ్ఞాతం వీడిన అనిల్.. నేరుగా మీడియా ముందుకు వచ్చి టీడీపీ నేతలపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాజాగా ఆదివారం కూడా ఆయన మరోమారు మీడియా మీట్ పెట్టారు. నేరుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించారు.

అనిల్ నిర్వహించిన ఈ రెండు మీడియా సమావేశాలను చూస్తుంటే… అసలు వ్యూహం ఏమిటంటూ ఆదివారం దాదాపుగా అన్ని పార్టీలు, మీడియాల్లోనూ చర్చకు తెర లేసింది. అనిల్ టీడీపీకి చెందిన కీలక నేతలైన వేమిరెడ్డి, రవిచంద్రలనే టార్గెట్ చేస్తూ టీడీపీపై ఎదురు దాడికి దిగుతున్నారా? లేదంటే… తనను తాను రక్షించుకునేందుకే ఆయన ఇలా ఆత్మరక్షణ వ్యూహాన్ని అవలంబిస్తున్నారా? అన్న దానిపై విశ్లేషణలు సాగుతున్నాయి. అనిల్ తో పాటు ఆయన ఆరోపణలు గుప్పిస్తున్న ఇద్దరు టీడీపీ నేతలు కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారే కావడం, గతంలో వేమిరెడ్డితో అనిల్ కలిసి పనిచేయడాన్ని గుర్తు చేసుకుంటున్న విశ్లేషకులు అనిల్ వ్యూహంపై సమాలోచనలు చేస్తున్నారు.

వాస్తవానికి నెల్లూరు జిల్లాకే చెందిన వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ ఇప్పటికే మైనింగ్ అక్రమాల కేసులో తప్పించుకుని తిరుగుతున్నారు. అయితే అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న అనిల్ మాత్రం ప్రత్యర్థి వర్గం పై… అది కూడా బలంగా ఉన్న ప్రత్యర్థులపై పదునైన మాటలతో దాడికి దిగుతున్నారు. వాస్తవానికి వేమిరెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా వ్యాపారాల్లో చేయి తిరిగిన బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. ఇక బీద రవిచంద్ర ఫ్యామిలీ కూడా వ్యాపారాల్లో బలమైన ముద్రనే వేసుకుని కూర్చుంది. అలాంటి ఇద్దరు నేతలపై అనిల్ చేస్తున్న ఆరోపణలు చేస్తుంటే.. అనిల్ వ్యూహమేమిటన్నది బోధ పడటం లేదన్న మాట అయితే గట్టిగానే వినిపిస్తోంది.

రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలపై వచ్చే ఆరోపణలకు ఎంతమాత్రం విలువ ఉండదు. అదే విపక్షంలో ఉండే నేతలపై ఆరోపణలు వచ్చాయంటే… క్షణాల్లో పోలీసులు వారి ఇళ్ల ముందు వాలిపోతారు. ఈ తరహా వైఖరికి ఏ పార్టీ కూడా అతీతం కాదనే చెప్పాలి. ఈ లెక్కన అనిల్ చెబుతున్నట్లు సైదాపురం, సిద్దివినాయక మైనింగ్ సైట్లలో ఎన్నెన్ని అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించినా ఫలితం ఉండదనే చెప్పాలి. అదే సమయంలో వైసీపీ అదికారంలో ఉండగా… అనిల్ నడిపించిన వ్యవహారాలను బయటకు తీస్తే మాత్రం ఆయన ఇట్టే బుక్కైపోతారనే చెప్పాలి. మరి ఇంతటి ప్రమాదాన్ని కళ్లెదుటే పెట్టుకుని అనిల్ ఇలా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారన్నదే అర్థం కావడం లేదు.