-->

బెయిల్ ఇవ్వ‌లేం: జ‌గ‌న్ స‌న్నిహితుల‌కు సుప్రీంకోర్టు షాక్‌

Supreme Court Shocker: No Bail for Jagan Aides in Liquor Scam

వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌న్నిహితులు, వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంలో కీల‌క ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుజ‌య్‌రెడ్డి, జ‌గ‌న్ ఓఎస్‌డీగా ప‌నిచేసిన కృష్ణ మోహ‌న్‌రెడ్డిల‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ త‌గిలింది. గ‌త విచార‌ణ‌లో ఈనెల 16(శుక్ర‌వారం) వ‌ర‌కు ప్ర‌త్యేక ర‌క్ష‌ణ క‌ల్పించిన సుప్రీంకోర్టు.. దానిని ఎత్తివేసింది. అంతేకాదు.. వారు పెట్టుకున్న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌ల‌ను కూడా కొట్టివేసింది.

ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. “మీకు ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌లేం. మీ పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా విచారిస్తోంది. విచార‌ణ‌కు భంగం క‌లిగించేలా న్యాయ‌స్థానం ఎలాంటి ర‌క్ష‌ణా క‌ల్పించ‌లేదు. విచార‌ణ మ‌ధ్య‌లో ఉండ‌గా.. దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. అధికారులు చేస్తున్న ప్ర‌య‌త్నానికి భంగం క‌లుగుతుంది. ఈ నేప‌థ్యంలో ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ల‌ను కొట్టివేస్తున్నాం.” అని పేర్కొంది.

మ‌ద్యం కుంభ‌కోణంలో క‌ర్త క‌ర్మ క్రియ రాజ్ క‌సిరెడ్డి అయితే.. ఆయ‌న‌కు అన్ని విధాలా స‌హ‌క‌రించింది ధ‌నుంజ‌య్ రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి అని ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం పేర్కొంది. ప్ర‌స్తుతం కేసు విచార‌ణ కీలక ద‌శలో ఉంద‌ని.. ఇప్పుడు ముంద‌స్తు బెయిల్ ఇస్తే.. విచార‌ణ‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. సాక్షుల‌ను కూడా వీరు ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉంద‌ని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ నేప‌థ్యంలో సుప్రీంకోర్టు వారి బెయిల్ పిటిష‌న్ల‌ను కొట్టి వేసింది.

కాకాణికి కూడా..

మ‌రోవైపు.. వైసీపీ మాజీ మంత్రి, నెల్లూరుకు చెందిన కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి కూడా సుప్రీంకోర్టులో భారీ షాక్ త‌గిలింది. స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని రుస్తుంబాద‌లో ఉన్న మైనింగ్‌ను అక్ర‌మంగా త‌వ్వి.. 2 కోట్ల రూపాయ‌ల విలువైన ఖ‌నిజాన్ని అక్ర‌మంగా త‌ర‌లించార‌ని ఆయ‌న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. కేసు న‌మోదైన నాటి నుంచి కాకాణి అధికారుల‌కు చిక్క‌కుండా త‌ప్పించుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని హైకోర్టును.. సుప్రీంకోర్టును కూడా ఆశ్ర‌యించారు. గ‌తంలోనే హైకోర్టు ఈ పిటిష‌న్‌ను తోసిపుచ్చ‌గా.. తాజాగా సుప్రీంకోర్టు కూడా.. కాకాణి పిటిష‌న్‌ను కొట్టివేసింది.