వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పట్లో కేసుల నుంచి బయటపడేలా కనిపించడం లేదు. తాజాగా వంశీ పై మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో 2019-24 మధ్య గన్నవరంలో మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డారన్నది ఆయన పై తాజాగా వచ్చిన అభియోగం. దీని పై మైనింగ్ ఏడీ గన్నవరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గన్నవరం నియోజకవర్గం జరిగిన మైనింగ్ అక్రమాలను కేసులో వివరించారు.
దీంతో వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు. దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన మైనింగ్ అక్ర మాలు చేశారని వంశీపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో వంశీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలినట్టు అయింది. వాస్తవానికి టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వంశీకి బెయిల్ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి నమోదైన సత్యవర్థన్ కిడ్నాప్, బెదింపుల కేసులో బెయిల్ వచ్చింది. కానీ, ఈలోగా ఎన్నికల కేసు నమోదైంది.
దీంతో బెయిల్ రావాల్సి ఉంది. ఈ బెయిల్ పిటిషన్లు ఒకవైపు విచారణలో ఉండగానే.. తాజాగా నమోదైన మైనింగ్ కేసులో వంశీని మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇక గురువారం రాత్రి వైసీపీ హయాంలో నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో వంశీ పై పీటీ వారెంట్ నమోదు చేసేందుకు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. కేసు నమోదు చేసి విచారణ చేయడంతో పాటు.. ఈ నెల 19లోపు వంశీని ఈ కేసులో హాజరు పర్చాలని కోర్టు ఆదేశించింది.
దీంతో ఆ కేసు కూడా మెడకు చుట్టుకుంది. మొత్తంగా చూస్తే.. వంశీ పై కేసులు వరుస పెట్టి నమోదు అవుతుండడం.. ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.