భారత్-పాక్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాదికి బహిరంగంగా మద్దతు తెలపడమే కాదు, ఆయుధాలను సైతం సప్లై చేసిన టర్కీ తీరును ఖండిస్తూ, ఇప్పుడు ఆ దేశాన్ని బహిష్కరించాలని, ఆ దేశంతో ఉన్న వ్యాపార సంబంధాలను తెంచుకోవాలని దేశ ప్రజల నుంచి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. తుర్కియే తీరుపై ఆగ్రహంతో ఉన్న వాణిజ్య వర్గాలు, ఆ దేశంతో తమకున్న వ్యాపార బంధాన్ని తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పుణె వ్యాపారులు ఈ తరహా నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.
ఢిల్లీలోని జేఎన్యూ, హైదరాబాద్లోని మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ వర్సిటీ సైతం తుర్కియేకు చెందిన వర్సిటీలతో తాము చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నట్లు తెలిసింది. అదే సమయంలో, ఆ దేశంతో ప్రభుత్వం చేసుకున్న కొన్ని ఒప్పందాలు, కీలక అంశాలకు సంబంధించి కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ఇలాంటి వేళ, తుర్కియే దేశానికి చెందిన వైమానిక సేవల సంస్థకు భారత ప్రభుత్వం ఇచ్చిన భద్రతా క్లియరెన్స్ను రద్దు చేసింది. దీంతో, తుర్కియేకు చెందిన రెండు అనుబంధ సంస్థలను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాల వద్ద గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ విధుల నుంచి తప్పించారు. ఈ రెండు సంస్థలు హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, గోవా, అహ్మదాబాద్, కన్నూర్, కొచ్చిన్లలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో సెలెబీ అనుబంధ సంస్థల ద్వారా సేవలు అందిస్తున్నాయి.
ఈ సంస్థలు విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్ సైడ్ జోన్లలో విధులు నిర్వహిస్తుంటాయి. తమ విధుల్లో భాగంగా ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను ఈ సంస్థ చేస్తుంది. అంతర్జాతీయ సర్వీసుల్లోనూ వీరే ఈ పనులు చేస్తుంటారు. తాజాగా వాటికి చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, తక్షణమే ఆ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. ఈ సేవలను వేరే సంస్థలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇంతకాలం వ్యాపారులు, దేశ ప్రజలు తమ వ్యక్తిగత స్థాయిలో ‘బాయ్ కాట్ తుర్కియే’ నినాదాన్ని చేపట్టగా, తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ నినాదం విస్తృతి పెరుగుతోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు, దేశంలోని పలు పెద్ద విద్యా సంస్థలు కూడా ఆ దేశంలోని సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా కేంద్రం మరో కీలక నిర్ణయం వెలువరించే అవకాశం ఉందని చెబుతున్నారు.
‘బాయ్ కాట్ తుర్కియే’ నినాదం అంతకంతకూ తీవ్రమవుతున్న వేళ, ఆ దేశంలోని పర్యాటకానికి, ప్రీ-వెడ్డింగ్, సినిమా షూటింగ్లకు వెళ్లొద్దని కేంద్రం ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. తుర్కియేతో ఉన్న అన్ని వ్యాపార సంబంధాలను తెంచుకోవడంతో పాటు, అజర్బైజాన్కు వెళ్లొద్దని కేంద్రం సూచించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా సినిమా కార్మిక సంఘాలు సైతం తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. చూస్తుంటే, రానున్న రోజుల్లో ఈ నినాదం మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లడమే కాదు, కఠిన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.