రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని అధికారిక నివాసం ‘వర్ష’లో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫడ్నవీస్ కూడా ‘ఎక్స్’ వేదికగా రోహిత్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫొటోలను పంచుకున్నారు. దీంతో రోహిత్ రాజకీయాల్లోకి అడుగుపెడతారా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

రోహిత్ శర్మ ఫడ్నవీస్‌ను కలవడం యాదృచ్ఛికమేనో లేక ఆలోచిత ప్రక్రియలో భాగమో స్పష్టత లేకపోయినా, ఈ సమావేశానికి వచ్చిన ప్రజా స్పందన ఆసక్తికరంగా మారింది. గతంలో పలువురు క్రికెటర్లు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో రోహిత్‌పై కూడా రాజకీయ ఆశలు రేగుతున్నాయి. ముంబైలో పుట్టి పెరిగిన రోహిత్‌కు మహారాష్ట్రలో మంచి క్రేజ్ ఉంది. అదే క్రమంలో రాజకీయ రంగంలోకి వెళ్లాలనే ఆలోచన ఉంటే ఆయనకు ప్రత్యేకించి క్యాంపెయిన్ అవసరం ఉండకపోవచ్చు. ఇక క్రికెట్ కెరీర్ కు చివరి రోజుల్లో ఏకంగా సీఎంను కలవడంతో సోషల్ మీడియాలో అలజడి మొదలైంది.

ఓవైపు రోహిత్ తన టెస్ట్ కెరీర్‌కు ముగింపు పలకగా, మరోవైపు వన్డే, టీ20ల్లో తాను కొనసాగుతానని సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వన్డే కెప్టెన్సీ కొనసాగుతుందా లేదా అనేది ప్రస్తుతం క్లారిటీ లేదు. ఇలాంటి వేళే ఫడ్నవీస్‌తో భేటీ కావడం వెనుక రాజకీయ భవిష్యత్తుకు సన్నాహమేనా? అనే అనుమానాలకు తావిస్తోంది.

రోహిత్ టెస్ట్ కెరీర్‌ను పరిశీలిస్తే, తన అరంగేట్రం నుంచి చివరి వరకు ఎంతో శ్రమించి స్థిరమైన స్థానాన్ని సంపాదించాడు. 67 టెస్టుల్లో 12 సెంచరీలు, 4,301 పరుగులతో భారత టెస్ట్ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఐసీసీ డబ్ల్యూటీసీలో అతని ప్రదర్శన అత్యుత్తమంగా నిలిచింది. ముఖ్యంగా ఓపెనర్‌గా వచ్చిన తర్వాత కెరీర్ మలుపు తిరిగింది. ఇప్పుడు రోహిత్ వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు తిరుగుతుందా? రాజకీయ రంగప్రవేశానికి బాటలు సిద్ధమవుతున్నాయా? అన్నది మరికొద్ది రోజులలో స్పష్టమవుతుంది.