కుప్పం.. కుప్ప‌కూలిన వైసీపీ రీజ‌నేంటి ..!

టీడీపీ అధినేత‌.. సీఎం చంద్ర‌బాబు.. సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో పునాదులు వేయ‌డ‌మే కాదు.. తామే బ‌లంగా నిలుస్తామ‌ని.. టీడీపీ సైకిల్‌కు నామ‌రూపాలు లేకుండా చేస్తామ‌ని బీరాలు ప‌లికిన వైసీపీ ఎన్నిక‌లు ముగిసిన ఏడాదిలోపే.. కుప్పంలో కుప్ప‌కూలింది. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్రతిష్టాత్మ‌కంగా తీసుకున్న అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌.. ఇక్క‌డ బ‌ల‌మైన టీడీపీని లేకుండా చేయాల‌ని కుట్రలు ప‌న్నార‌ని ఆ పార్టీ నాయ‌కులు చెప్పిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్సీగా ఉన్న భ‌ర‌త్‌కు టికెట్ కూడా ఇచ్చారు. అయితే.. చంద్ర‌బాబు హ‌వామాత్రం ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి ప్ర‌త్యేకంగా కుప్పంలోనే పాగా వేసి టీడీపీని బ‌లోపేతం చేశారు. ప్ర‌స్తుతం కుప్పంలో ఇంటి నిర్మాణం కూడా పూర్తికావొచ్చింది. మ‌రోవైపు.. కుప్పంలో వైసీపీకి బీట‌లు ఇచ్చి.. కుప్ప‌కూలింది. నిజానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల త‌ర్వాత‌.. భ‌ర‌త్ నిన్న మొన్న‌టి వ‌ర‌కు కుప్పం జోలికి కూడా పోలేదు. పైగా.. కుప్పంలోని వైసీపీ కార్యాల‌యం.. టిఫిన్ సెంట‌ర్‌గా మారిపోయింది.

ఇక‌, తాజాగా ఎంట్రీ ఇచ్చిన భ‌ర‌త్‌.. త‌న‌కు వ్య‌తిరేకంగా ఓటేసేలా ప్ర‌జ‌ల‌ను ప్రోత్స‌హించారని పేర్కొంటూ .. కొంద‌రిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇది గాలి వాన నుంచి తుఫానుగా మారి… వైసీపీలో రాజీనామాల ప‌ర్వం ప్రారంభ‌మైంది. కుప్పం నియోజకవర్గ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ భరత్ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మెజారిటీ నాయ‌కులు భరత్‌ను నమ్ముకుంటే పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రిజైన్లు చేశారు.

శాంతిపురం జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, మాజీ సర్పంచి మురళితో పాటు పలువురు నేతలు కూతేగా నిపల్లెలో సమావేశమై.. భరత్ తీరుకు వ్య‌తిరేకంగా పార్టీని వ‌దిలేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. అంతేకాదు.. పార్టీని నమ్ముకున్న వారిని కాదని, కొందరికే పదవులు ఇస్తున్నారని విమర్శించారు. రామకుప్పం ఎంపీపీ ఉప ఎన్నికలోనూ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే ఆయా మండ‌లాల్లోని నాయ‌కులు రాజీనామా చేశారు. అయితే.. ఈ విష‌యం తెలిసిన భ‌ర‌త్‌. వారి రాజీనామాల‌కు ముందే.. వ్యూహాత్మ‌కంగా వారిని పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో ఆగ్ర‌హోద‌గ్రులైన నాయ‌కులు.. భ‌ర‌త్ దిష్టి బొమ్మ‌లు ద‌గ్ధం చేశారు.