మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మక పెట్టుబడుల వేటలో కీలకమైన రెన్యూ ఎనర్జీ
ఒకటి. 2014-17 మధ్య కాలంలో కియా కార్ల విడిభాగాల తయారీ యూనిట్ను తీసుకువచ్చిన ఆయన.. తాజాగా రెన్యూ ఎనర్జీ
సంస్థను ఏపీకి తీసుకువచ్చారు. అది కూడా.. కియా ఏర్పాటు చేసిన అనంతపురం జిల్లాలోనే ఇప్పుడు రెన్యూ ఎనర్జీ సంస్థనూతన ప్లాంటును ఏర్పాటు చేయనుండడం గమనార్హం. పునరుత్పాదక ఇంధన రంగానికి కేంద్రం పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో కొన్నాళ్ల కిందట దావోస్లో పర్యటించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రెన్యూ ఎనర్జీస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఈ సంస్థ వివిధ దశల్లో 22 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థను ఏపీలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే.. దీనిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న చర్చ కొంత ఆలస్యమైంది. ముందుగా కర్నూలు అనుకున్నారు. తర్వాత.. కడపలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు.
అయితే.. సీమకు మణిహారంగా ఉన్న అనంతపురంలో(జిల్లాల్లో నూ పెద్దది, వనరులు కూడా ఉన్నాయి) ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కంపెనీకి సమాచారం అందించారు. దీంతో ఈ నెల 16న రెన్యూ ఎనర్జీ సంస్థ.. ఇక్కడ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థను ఏర్పాటు చేయనుంది. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో రెన్యూ సంస్థ రూ.22 వేల కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్
ఏర్పాటు చేయనుంది.
ఏంటి లాభం?
— తొలిదశలో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. తద్వారా వందల సంఖ్యంలో ఉద్యోగాలు లభిస్తాయి.
— రెండో దశలో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లను ఏర్పాటు చేస్తుంది.
— ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీ, గ్రిడ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. తద్వారా విద్యుత్ వినియోగానికి ఎలాంటి ఆటంకం లేని వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
— స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.