ఏమాత్రం కనికరం లేకుండా భారత హిందువుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ హస్తం ఉన్నట్లు బహిర్గతమైన విషయం తెలిసిందే. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత పై ఉసిగొల్పడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈసారి భారత ఆర్మీ కఠినంగా సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్ దాడిలో తీవ్ర నష్టాన్ని చవిచూసిన పాకిస్థాన్ ఇప్పుడు మరో వివాదస్పద ప్రకటనతో వార్తల్లో నిలిచింది.
ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న బహావల్పూర్ ప్రాంతంలో జరిగిన భారత వైమానిక దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 14 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా, ఈ దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం కింద ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.
ఈ ప్రకటనతో తాజాగా మసూద్ అజార్కు రూ.14 కోట్లు లభించే అవకాశముందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, దాడిలో చనిపోయిన వారందరూ అతని కుటుంబ సభ్యులే కావడం, మిగిలిన వారసులు లేరని భావించడంతో ఆ మొత్తం నేరుగా అతనికే అందే అవకాశం ఉందన్నదే వాదన. ఇప్పటికే అంతర్జాతీయంగా నిషేధిత ఉగ్రవాదిగా గుర్తింపు పొందిన మసూద్ అజార్కు ఇలా ప్రభుత్వం నేరుగా నష్టం పరిహారం ఇవ్వబోతోందన్న అంశంపై పెద్ద చర్చ మొదలైంది.
భారత వైమానిక దళాలు మే 7న బహావల్పూర్లో జైషే మహమ్మద్కు చెందిన ప్రధాన కేంద్రంపై ఈ దాడులు నిర్వహించాయి. ఈ ప్రాంతం జామియా మజ్జీద్ సుభాన్ అల్లా, లేదా ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ పేర్లతో గుర్తింపు పొందింది. మసూద్ అజార్ సంస్థకు ఇది కీలకంగా ఉండటంతో టార్గెట్గా ఎంపికైంది. ఈ దాడుల్లో అరవై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అని భారత ప్రభుత్వం పేర్కొంది.
ఇక పాక్ ప్రభుత్వం ఈ దాడుల్లో మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న పేరుతో నష్టం పరిహారం ప్రకటించడం వెనక రాజకీయం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమ అంతర్జాతీయ మిత్రదేశాల ముందు సహానుభూతిని సేకరించేందుకు, భారత్పై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు చేయడానికే ఈ ప్రకటన అని విమర్శలు వినిపిస్తున్నాయి.