నా సిందూరాన్ని దేశ రక్షణకు పంపిస్తున్నా: నవవధువు

మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న కలాంసర గ్రామానికి చెందిన యామినితో ఘనంగా జరిగింది. సాధారణంగా పెళ్లి అనంతరం ఒక కొత్త జంట కలిసిన ప్రతి క్షణం ఆనందాన్ని పంచుకుంటూ గడపాలి. కానీ ఈ జంటకు అది సాధ్యం కాలేదు. పెళ్లైన మూడో రోజే పాటిల్‌కు ఆర్మీ నుంచి అత్యవసర పిలుపు రావడంతో, తక్షణం విధుల కోసం బార్డర్‌కి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఈ విరహానికి కారణం దేశంలో తారాస్థాయికి చేరిన ఉద్రిక్తతలు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో సైన్యంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు అత్యంత కీలకంగా మారారు. అప్పుడు వ్యక్తిగత జీవితం కాదు… దేశం కోసం పోరాడాలి అనే కసితో ఉన్నారు జవాన్లు. ఈ సమయంలో పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టిన జవాన్ పాటిల్ కూడా ‘దేశం మొదట’ అనే అర్జెంటు పిలుపుకి స్పందించాల్సి వచ్చింది.

పచోరా రైల్వే స్టేషన్‌లో జవాన్ పాటిల్‌కు ఇచ్చిన వీడ్కోలు దృశ్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నూతన వధువు యామిని “నా సిందూరాన్ని దేశ రక్షణకు పంపిస్తున్నా” అని చెప్పిన మాటలు ఎందరో హృదయాలను తాకాయి. ఆమె కన్నీటిని కళ్ళల్లోనే నిలిపి భర్తను గర్వంగా వీడ్కోలు చెప్పిన తీరుతో పలు వర్గాల ప్రజలు అద్భుతమైన ధైర్యానికి, త్యాగానికి శిరసు వంచుతున్నారు.

మనోజ్ పాటిల్ లాంటి జవాన్‌లు, యామిని లాంటి జీవిత భాగస్వాములు దేశానికి నిజమైన శక్తి. వీరి త్యాగాలను గౌరవించడం మాత్రమే కాదు, వీరి కుటుంబాలకు మానసిక, సామాజిక మద్దతు కల్పించడం కూడా సమాజం బాధ్యతగా గుర్తించాలి. ప్రతి వీరుడు వెనుక ఒక ధైర్యమైన గుండె ఉంటుంది… అది మరువకూడదు.