మాట‌లు చెప్పొద్దు.. చేత‌ల‌కు రండి: చంద్ర‌బాబు పిలుపు

ఏపీ సీఎం చంద్ర‌బాబు తొలిసారి బ‌హిరంగ వేదిక‌పై స్వ‌ల్ప ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ‘మాట‌లు చెప్పొద్దు.. చేత‌ల‌కు రండి!’ అని ఆయ‌న పిలుపునిచ్చారు. తాజాగా అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన సీఎం.. సీమ‌కు వ‌ర‌దాయినిగా పేర్కొనే హంద్రీనీవా ప‌నుల‌ను ప‌రిశీలించారు. మండు టెండ‌లో దాదాపు గంట‌న్న‌ర పాటు ప్రాజెక్టు వ‌ద్దే ఆయ‌న ఉన్నారు. అధికారులు, ఇంజ‌నీర్ల‌ను అడిగి వివ‌రాలు తెలుసుకున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టులో పూడిక తీత ప‌నుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. వీటిని వేగంగా పూర్తి చేయాల‌ని ఆయ‌న ఆదేశించారు.

అనంత‌రం నిర్వ‌హించిన స‌భ‌లో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదిర‌కంగా ఎక్కువ‌గా ఉంద‌ని.. అన్నీ ప్ర‌భుత్వ‌మే చేయాలంటే కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో పీ-4 ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చామ‌న్నారు. అంద‌రూ స‌మాజం వ‌ల్లే పైకి వ‌చ్చార‌ని చెప్పారు. ‘ఇప్పుడు ఉన్న‌త చ‌దువులు చ‌దివి బాగుప‌డిన వారంతా.. పేద‌ల క‌ష్టం నుంచే ఎదిగార‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.’ అని చెప్పారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పీ-4కు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న సూచించారు. ఈ విష‌యంలో మాట‌లు చెప్పుకోవ‌డానికి ఎంతో మంది ఉన్నార‌ని.. కానీ, చేత‌ల‌కు దిగాల‌ని సూచించారు.

రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల మంది పేద‌ల‌ను ఉన్న‌త‌వ‌ర్గాలుగా తీర్చిదిద్దాల‌ని సంక‌ల్పించిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు చెప్పారు. వీరంతా పేద‌రికంలోనే ఎందుకు ఉండాల‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం-ప్రైవేటు భాగ‌స్వామ్యంతో పేద‌ల‌ను పైకి తీసుకురావ‌డం.. ఉన్న‌త వ‌ర్గాలుగా ప్ర‌తి ఒక్క‌రి క‌ర్త‌వ్య‌మ‌ని పేర్కొన్నారు. ‘పేద‌రికంలో ఉన్న 20శాతం మందికి అండగా నిలుద్దాం. సూచనలు, సలహాలే కాదు.. అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేయండి’ అని ఒకింత ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శిస్తూ.. వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పేద‌లు.. వ‌చ్చే నాలుగేళ్ల త‌ర్వాత‌.. ధ‌న‌వంతులు కావాల‌నేదే త‌మ సంక‌ల్ప‌మ‌ని పేర్కొన్నారు.

2029 ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో పేద‌రికం లేకుండా చేయాల‌ని భావిస్తున్నామ‌ని సీఎం చెప్పారు. ఈ నేప‌థ్యంలో పీ4ను ఆవిష్కరించామ‌ని.. ఇప్ప‌టికే చాలా మందిని సంప్ర‌దించామ‌న్నారు. డేటాను కూడా రెడీ చేశామ‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే మ‌రింత పార‌దర్శ‌కంగా పేద‌ల‌ను ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. త‌న‌వంతు సాయంగా గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌త వ‌ర్గాల‌కు అండ‌గా ఉంటుంద‌ని.. పేద‌ల‌ను సంప‌న్నులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.