కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం లీకేజీ వ్య‌వ‌హారంపై దేశ‌వ్యాప్త ఉద్య‌మం చేప‌ట్టిన‌ప్పుడు.. ప్ర‌జ‌ల నుంచి భారీ మ‌ద్ద‌తు ల‌భించిన విష‌యం తెలిసిందే. చ‌లో పార్ల‌మెంటుకు పిలుపునిచ్చిన‌ప్పుడు కూడా వారికి మ‌ద్ద‌తుగా అనేక మంది త‌ల్లిదండ్రులు రోడ్డెక్కారు. కానీ, తాజాగా రాజ‌స్థాన్‌లో ఇదే కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌జ‌లు త‌రిమిత‌రిమి కొట్టారు.

ఏం జ‌రిగింది?

గ్రామీణ ప్రాంతాల్లో పాఠ‌శాల‌లను బాగు చేసుకుందాం. పిలుపుతో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే దేశ‌వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఈ క్ర‌మంలో తానే స్వ‌యంగా మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. పాఠ‌శాలలను ప‌రిశీలించారు. ఇలానే.. తాజాగా సీజేపీకి చెందిన కో-కన్వీర్‌ అశుతోష్‌ రంకా(ఢిల్లీ వాసి) నేతృత్వంలో కొంతమంది కార్యకర్తలు శుక్రవారం రాజస్థాన్‌లో పర్యటించారు.

రాష్ట్ర రాజ‌ధాని జైపుర్ లో ఉన్న‌ రాంపురా కన్వర్‌పురా గ్రామంలోని పాఠ‌శాల‌ల‌ను ప‌రిశీలించాల‌ని నిర్ణయించుకున్నారు. అయితే.. ఈ విష‌యం తెలిసిన ఆ గ్రామ ప్ర‌జ‌లు.. గ్రామ స‌రిహ‌ద్దుల్లోకి వంద‌లాదిగా త‌ర‌లి వ‌చ్చారు. త‌మ గ్రామంలోకి రావ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పారు. త‌మ ఊళ్ల‌లోని పాఠ‌శాల‌ల ప‌రిస్థితి త‌మ‌కు తెలుసున‌ని.. మీరు ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం లేద‌ని వాగ్వాదానికి దిగారు. ఈ క్ర‌మంలో సీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు గ్రామ‌స్థుల‌కు మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది.

దీంతో కోపోద్రిక్తులైన గ్రామ‌స్థులు.. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. దాడికి దిగారు. చేతికి ఏది అందితే దాంతో చిత‌క్కొట్టారు. దీంతో భ‌య భ్రాంతుల‌కు గురైన సీజేపీ కార్య‌క‌ర్త‌లు.. అక్క‌డ నుంచి కార్ల‌లో తిరుగు ముఖం ప‌ట్టారు. అయితే.. కొంద‌రు యువ‌త వారి కార్ల‌పై రాళ్లు విసిరారు. మ‌రికొంద‌రు దొరికిన వారిని దొరిక‌న‌ట్టు కొట్టారు. దీంతో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా అక్క‌డి నుంచి తప్పించుకున్నారు. కాగా.. రాజ‌స్తాన్‌లో బీజేపీ అధికారంలో ఉన్న విష‌యం తెలిసిందే. దీంతో దీని వెనుక ఏదో రాజకీయ కుట్ర ఉందని, సాధారణ ప్రజలు ఇలాంటి మంచి పనులను అడ్డుకోరని చాలామంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.