ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి తనయుడి వివాహానికి హాజరైన జగన్ వధూవరులను ఆశీర్వదించారు. ఎప్పటి లాగే జగన్ క్రౌడ్ పుల్లర్ అని, మాస్ లీడర్ అని, అందుకే హైదరాబాద్ లో కూడా జగన్ కోసం జనం తండోపతండాలుగా వచ్చారని ఆయన అనుకూల మీడియా చెబుతోంది. ఇక, ఈ సారి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లతో జగన్ ఉన్న ఫ్లెక్సీలు దర్శనమివ్వడం కాస్త కొత్తగా ఉంది.

అయితే, జగన్ ఆ పెళ్లికి వెళ్లడం, జగన్ ఫ్లెక్సీలు, జగన్ కోసం వచ్చిన క్రౌడ్ గురించి కాదుగానీ, ఆ పెళ్లి కొడుకు తండ్రిపై ఉన్న కేసుల ట్రాక్ రికార్డ్ గురించి తెలిసి కూడా జగన్ ఆ పెళ్లికి వెళ్లిన వైనంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు కుమారుడు పినాక్ శర్మ వివాహ వేడుకకు ముఖ్య అతిథిగా జగన్ హాజరయ్యారు. పీఎస్సార్ ఆంజనేయులు పేరు కొద్ది నెలల క్రితం మీడియాలో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా, ఏపీపీఎస్సీ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన. జగన్ హయాంలో జరిగిన గ్రూప్-1 పోస్టుల నియామకాల్లో అక్రమాలపై చర్చకు రావాలని టీడీపీ సవాల్ విసురుతున్న సంగతి తెలిసిందే.

ఆ నియామక ప్రక్రియలో అవకతవకలకు సూత్రధారి ఈ పీఎస్సార్ ఆంజనేయులు అని సిట్ అధికారులు గతంలో ఇచ్చిన నివేదికలో తేల్చారు. అంతేకాదు. జగన్ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంలో పాత ఫైళ్లను ఆ కేసులో ఇతర నిందితులతో కలిసి ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నారని సిట్ అధికారులు గుర్తించారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇక, ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ అక్రమ అరెస్టు కేసులో ఆయనను చంద్రబాబు సర్కార్ ఆల్రెడీ సస్పెండ్ చేసింది. జెత్వానీని అరెస్టు చేయించిన ఆంజనేయులును పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఇన్ని అవకతవకలకు పాల్పడ్డ ఐపీఎస్ అధికారి ఇంట జరుగుతున్న పెళ్లికి జగన్ వెళ్లడం చర్చనీయాంశమైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడి సస్పెన్షన్‌ కు గురై సీఐడీ విచారణ ఎదుర్కొంటున్న ఆంజనేయులు ఇంట్లో ప్రైవేట్ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ వెళ్లడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.