లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. దీంతో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం కూడా ఓట‌ర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సుల‌ను రెడీ చేసుకుంటోంది. అక్టోబ‌రులోగా ఈ ఎన్నిక‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేశారు. దీనికి సంబంధించి నాయ‌కులు కూడా రెడీగా ఉండాలని సూచించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లో విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌న్నారు.

సీఎం ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఎన్నిక‌ల సంఘం పోలింగ్ నిర్వ‌హ‌ణ‌కు సిద్ధం అవుతోంది. ప్ర‌ధానంగా బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్లు కూడా అమ‌లు చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డంతో ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ వ్య‌వ‌హారం చ‌ర్చ‌కు దారితీసింది. “చంద్ర‌బాబు మాదిరిగా మేం.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునేది లేదు. ఈ ఎన్నిక‌లు ఎలా జ‌రిగినా మాకు న‌ష్టం లేదు.“ అని వైసీపీ సీనియ‌ర్ నేత‌, మండ‌లిలో వైసీపీ ప‌క్ష నాయ‌కుడు బొత్స స‌త్యనారాయ‌ణ తేల్చేశారు.

ఇక‌, బీసీల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న 23 శాతం రిజ‌ర్వేష‌న్‌ను ఏకంగా 11 శాతం పెంచేసి 34 శాతం అమ‌లు చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించ‌డంతో స‌హ‌జంగానే బీసీల్లోనూ ఉత్సాహం పెరిగింది. దీంతో ఆ వ‌ర్గం ఓట్లు గుండుగుత్త‌గా టీడీపీ కూట‌మి పార్టీల‌కే ద‌క్క‌నున్నాయి. ఫ‌లితంగా స్థానికంలో ఎలాగైనా గెలవాల‌న్న వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆశ‌లు ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదు. అందుకే.. ముందుగానే బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌మ వైఫ‌ల్యాన్ని అంచ‌నా వేశార‌న్న వాద‌న టీడీపీలో వినిపిస్తోంది.

ముందే చెప్పేశారు: టీడీపీ

వైసీపీ నేత బొత్స వ్యాఖ్య‌ల‌పై టీడీపీ మాజీ మంత్రులు , సీనియ‌ర్ నాయకులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ముందే చేతులు ఎత్తేశార‌ని మాజీ మంత్రి సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీకి ద‌మ్ము లేద‌ని.. ప్ర‌జ‌ల్లో తిరుగుబాటు రావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. మ‌రికొంద‌రు నాయ‌కులు.. వైసీపీ ముందే చెప్పేసింద‌ని.. ఇక‌, వైసీపీ ప‌రిస్థితి తాళం వేసుకోవ‌డ‌మేన‌ని స్థానికంలో 100 ప‌ర్సంట్ త‌మ‌దే విజ‌య‌మ‌ని కూట‌మి నాయ‌కులు చెబుతున్నారు.