క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే స్థాయిలో ఇక్క‌డ భూముల ధ‌ర‌లు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. ఎక‌రా భూమి ఏకంగా  264 కోట్ల‌కు అమ్మారు. ప్ర‌భుత్వం నిర్వ‌హించిన వేలంలో ఎంఎస్‌ఎన్‌ రియాలిటీ సంస్థ ఎక‌రాకు రూ.264 కోట్ల రూపాయ‌ల చొప్పున 5 ఎక‌రాల 25 సెంట్ల‌ను ఈ సంస్థ ద‌క్కించుకుంది. దీంతో 1500 కోట్ల రూపాయ‌ల‌కు పైగా సొమ్ము ప్ర‌భుత్వానికి స‌మ‌కూరింది.

రాయ‌దుర్గం ప‌రిధిలోని పాన్ మ‌క్తా ప్రాంతంలో ఉన్న స‌ర్వే నెంబ‌రు 83/1 లో 5.25 ఎక‌రాల భూమిని విక్ర‌యించాల‌ని తెలంగాణ ఇండ‌స్ట్రియ‌ల్‌, ఇన్‌ఫ్ట్రాస్ట్ర‌క్చ‌ర్ కార్పొరేష‌న్‌(టీజీ ఐఐసీ) నిర్ణ‌యించింది. దీనికి ప్ర‌భుత్వం కూడా ఓకే చెప్పింది. అనంత‌రం.. గ‌త వారం కింద‌టే వేలం ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలో ఎంఎస్‌ఎన్‌ రియాలిటీ సంస్థ స‌హా ప‌లు సంస్థ‌లు ఈ వేలంలో పాల్గొన్నాయి. చివ‌ర‌కు ఎంఎస్‌ఎన్‌ రియాలిటీ సంస్థ ఎక‌రా 264 కోట్ల రూపాయ‌ల చొప్పున కొనుగోలు చేసింది.

సుప్రీంలో తేలిపోయింది..

వాస్త‌వానికి రాయ‌దుర్గం భూముల వేలం వ్య‌వహారం ఆద్యంతం ఉత్కంట‌గా మారింది. ఈ వేలాన్ని నిలిపి వేయాల‌ని కోరుతూ.. న్యాయ‌వాది ప్ర‌ణ‌య న‌ర‌సింహారెడ్డి సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. శుక్ర‌వారం ఈ పిటిష‌న్‌పై కోర్టు తీర్పు చెప్పాల్సి ఉంది. దీంతో వేలం వాయిదా వేయాల‌ని తొలుత నిర్ణ‌యించారు. తీర్పు ఎలా వ‌స్తుందోన‌న్న టెన్ష‌న్ టీజీఐఐసీలో కొన‌సాగింది. అయితే.. సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టి వేసింది. ఏదైనా ఉంటే.. రాష్ట్ర హైకోర్టులోనే తేల్చుకోవాల‌ని పిటిష‌న‌ర్‌కు సూచించింది. దీంతో టీజీఐఐసీ వెంట‌నే వేలం ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించింది.

గ‌తంలో 237 కోట్లు..

ఇక‌, రాయ‌దుర్గం పారిశ్రామిక ప్రాంతంలో ప్ర‌భుత్వం ఈ ఏడాది మే నెల‌లోనూ 12 ఎక‌రాల భూమిని విక్ర యించింది. అప్ప‌ట్లో కూడా భారీ ధ‌ర‌లే ప‌లికాయి. అప్ప‌ట్లో ఎక‌రా భూమి 237 కోట్ల‌రూపాయ‌ల‌కు ఒక రియ‌ల్ ఎస్టేట్ సంస్థ ద‌క్కించుకుంది. ఇప్పుడు దానికి మించి 264 కోట్ల రూపాయ‌లు(గ‌తానికి ఇప్ప‌టికి 23 కోట్ల పైచిలుకు ఎక్కువ‌) ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. కాగా.. ఈ ప్రాంతం మొత్తం ఫ్యూచ‌ర్ సిటీ కింద‌కు వ‌స్తుండ‌డం.. భ‌విష్య‌త్తులో న‌గ‌ర విస్త‌ర‌ణ పెరుగుతున్న క్ర‌మంలో ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని అంటున్నారు.