ఏపీ స్కూళ్లలో కరోనా కలకలం?

కరోనా విజృంభణ మొదలవుతున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలను ఈసీ వాయిదా వేస్తే దాని మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది జగన్ సర్కారు. ఐతే ఇప్పుడు ఇంకా కరోనా తగ్గుముఖం పట్టని నేపథ్యంలో ఈసీ స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం అందుకే ససేమిరా అంటోంది. అంత వరకు బాగానే ఉంది. కానీ ఎన్నికలు నిర్వహించకపోవడానికి కరోనాను కారణంగా చూపుతున్న అదే ప్రభుత్వం ఏపీలో స్కూళ్లు తెరవడానికి అనుమతులు ఇచ్చేసింది.

నవంబరు 2న అక్కడ పాఠశాలలు తెరుచుకున్నాయి. ముందుగా 9, 10 తరగతులను స్కూళ్లకు అనుమతిస్తున్నారు. ఐతే ఈ సందర్భంగా విద్యార్థులకు కరోనా వస్తే పాఠశాలది బాధ్యత కాదంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో హామీ పత్రాలు రాయించుకుని మరీ వారిని పాఠశాలలకు రప్పిస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే ఏపీలోనే కాదు.. దేశంలో ఎక్కడా కరోనా వ్యాప్తి పూర్తిగా ఆగిపోలేదు. కొంచెం తగ్గుముఖం పట్టింది. జనాల్లో భయం పోయిందంతే. స్కూళ్లు రీఓపెన్ చేస్తే విద్యార్థులకు కరోనా సోకే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా సరే.. ప్రభుత్వం ముందడుగే వేసింది. తీరా చూస్తే ఇప్పుడు స్కూళ్లు తెరిచిన మూడు రోజుల్లోనే 262 మంది విద్యార్థులు, 160 మంది ఉపాధ్యాయులు కరోనా బారినట్లు సమాచారం బయటికి వచ్చింది.

ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి వెల్లడించినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. ఇప్పటికీ ఏపీలో రోజూ వేలల్లో కేసులు నమోదవుుతండగా.. స్కూళ్లలో కరోనా కేసులు బయటపడవని అనుకుంటే అంతకంటే వెర్రితనం ఇంకోటి లేదు. ఓవైపు ఎన్నికలు నిర్వహించడానికి కరోనాను అడ్డుగా చూపించిన ప్రభుత్వం.. పాఠశాలలు మాత్రం ఎలా తెరిచిందన్నది అర్థం కాని విషయం. పిల్లలకు కరోనా సోకితే తల్లిదండ్రులు ఎంతగా ఆందోళన చెందుతారో చెప్పేదేముంది? ఈ నేపథ్యంలో మళ్లీ ఏపీలో స్కూళ్లు మూతపడటం ఖాయమనే చెప్పాలి.