భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా తీసుకోని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశ భద్రత, రక్షణ విషయంలో అవసరమైన సామగ్రి కొనుగోలు.. ఇతర అవసరాలకు కూడా కేంద్రానికి సొమ్ములు అవసరం. అయితే.. ఇప్పుడు ఇబ్బంది ఉందని కేంద్రమేమీ ప్రకటించలేదు. కానీ, తమ వంతు బాధ్యతగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దేశ రక్షణ శాఖ ఖజానాకు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఒక నెల వేతనాలు ఇవ్వాలని ఆయన నిర్ణయించారు. అయితే.. ఇది స్వచ్ఛంద నిర్ణయమేనని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిర్ణయాన్ని చెప్పాలని ఆ యన సూచించారు. భారత ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయం ఇదేనని.. దీనిలో రాజకీయాలకు విమర్శలకు తావులేదని స్పష్టం చేశారు. మనం ఇచ్చే ఒక నెల వేతనం.. సైనికులకు ఏ కొంచెం ఉప యోగపడినా.. అది దేశం కోసం చేసినట్టే అవుతుంది అని పేర్కొన్నారు.
ఈ విషయంలో అందరూ కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీలకు అతీతంగా అందరికీ పిలుపునిచ్చారు. కాగా.. ఆది నుంచి కూడా రేవంత్ రెడ్డి దేశ భద్రత, పాకిస్థాన్ వైఖరి విషయంలో ఆచి తూచి స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద దాడుల అనంతరం.. రాష్ట్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి.. స్వయంగా పాల్గొన్నారు. మాక్ డ్రిల్ను కూడా సక్సెస్ చేశారు. అదేవిధంగా సిందూర్ విజయవంతమైన నేపథ్యంలోనూ మరోసారి క్యాండిల్ ర్యాలీలోనూ సీఎం పాల్గొన్న విషయం తెలిసిందే.
మరోవైపు.. రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లో భద్రత, శంషాబాద్ ఎయిర్ పోర్టు, వరంగల్ ఎయిర్ పోర్టుల భద్రత విషయంపై మంత్రి భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా రాష్ట్రంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపైనా ఆయన సమీక్షించారు. అభ్యాస్ పేరుతో నిర్వహించిన మాక్ డ్రిల్ తో అందరికీ అవగాహన ఏర్పడిందని.. అవసరమైతే.. మరోసారి స్వచ్ఛందంగా ఈ డ్రిల్ నిర్వహించాలని సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates