పాకిస్థాన్‌లో అంత‌ర్యుద్ధం.. హెహ‌బాజ్ చుట్టూ ఉచ్చు!

భార‌త్‌ను ఢీ కొంటామ‌ని.. త‌గిన విధంగా బుద్ది చెబుతామ‌ని బీరాలు ప‌లికిన పాకిస్థాన్ ప్ర‌ధాన మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్ చుట్టూ పెద్ద ఉచ్చు చిక్కుకుంది. ఆయ‌న‌ను ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వి నుంచి దించేయాలంటూ.. పాకిస్థాన్ పార్ల‌మెంటులో మెజారిటీ స‌భ్యులు డిమాండ్ చేశారు. వీరిలో మాజీ ప్ర‌ధాని, ప్ర‌ముఖ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా సొంత పార్టీలు ఎంపీలు కూడా.. ప్ర‌ధాని ష‌రీఫ్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ‘పాక్ సైన్యం సింహాలుగా ఉంటే.. దీనిని న‌క్క న‌డిపిస్తోంది’ అని పార్ల‌మెంటులో ఓ ఎంపీ చేసిన వ్యాఖ్య తీవ్ర దుమారం రేపింది.

ఇక‌, దేశ‌వ్యాప్తంగా కూడా.. పాక్ ప్ర‌ధానిని తొల‌గించాలంటూ.. ప్ర‌జ‌లు ఉద్య‌మ బాట ప‌ట్టారు. రావ‌ల్పిండిలో నిర‌స‌న వ్య‌క్తం చేసిన విద్యార్థుల‌పై వాట‌ర్ గ‌న్స్ విజృంభించాయి. ఇక‌, ప్ర‌ధాన నాయ‌కులు, క్రికెట‌ర్లు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను అత్యంత ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ఇదిలావుంటే.. ఇస్లామాబాద్‌లోని ప్ర‌ధాన మంత్రి నివాసం వ‌ద్ద నాలుగు పేలుళ్లు సంభ‌వించాయి. దీంతో త‌న ప్రాణాల‌కు ముప్పు ఉంద‌ని భావించిన ప్ర‌ధాని ష‌రీఫ్‌.. వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన‌ట్టు పాక్ ప్ర‌ధాన మీడియా డాన్‌ పేర్కొంది. అదేవిధంగా ర‌క్ష‌ణ శాఖ మంత్రి కూడా.. త‌న ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసుకున్న‌ట్టు తెలిపింది.

ఇదిలావుంటే.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌పైనా ప్ర‌జాగ్ర‌హం పెల్లుబుకుతోంది. భార‌త్ దాడుల విష‌యంలో ఆయ‌న చేతులు ఎత్తేశార‌ని.. ఆయ‌న‌ను త‌క్ష‌ణమే ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని ప‌లువురు వేలాదిగా సుప్రీంకోర్టులో పిటిష‌న్‌లు వేశారు. వీటిని హ‌డావుడిగా విచారించిన సుప్రీంకోర్టు.. మునీర్‌.. విష‌యంలో త‌మ‌కు ఎలాంటి సందేహం లేద‌ని తెలిపింది. ఆయ‌న‌కు త్రివిధ ద‌ళాల అధికారాల‌ను అప్ప‌గించింది. దీంతో ప్ర‌భుత్వంతో నిమిత్తం లేకుండా.. మునీర్ చ‌ర్య‌లు తీసుకునే వెసులుబాటు ద‌క్కింది. అయితే.. మునీర్ అంత స‌మ‌ర్ధుడు కాడ‌ని.. ఆయ‌న‌కు యుద్ధ నైపుణ్యం తెలియ‌ద‌ని ఆర్మీ వ‌ర్గాలు సైతం బాహాటంగానే ప్ర‌క‌టిస్తున్నాయి.

ఇది కూడా ప్ర‌ధాని ష‌రీఫ్‌కు ఇబ్బందిగా మారింది. మ‌రోవైపు.. ప్ర‌స్తుతం జైల్లో ఉన్న మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌ను త‌క్ష‌ణ‌మే విడిచి పెట్టాల‌ని.. ఆయ‌న సార‌థ్యంలో భార‌త్‌పై ప్ర‌తిదాడి చేయాల‌న్న నిర‌స‌న‌లు పెరుగుతున్నాయి. ఇంకోవైపు.. సింధు జ‌లాల విష‌యంలో తాము ఎట్టి ప‌రిస్థితిలోనూ జోక్యం చేసుకునేది లేద‌ని ప్ర‌పంచ బ్యాంకు తేల్చి చెప్పింది. వాస్త‌వానికి 1960లో భార‌త్‌-పాకిస్థాన్‌ల మ‌ధ్య సింధు జ‌లాల ఒప్పందం .. ప్ర‌పంచ బ్యాంకు మ‌ధ్య‌వ‌ర్తిత్వంతోనే జ‌రిగింది.

అయితే.. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం సింధు జ‌లాల ఒప్పందాన్ని ప‌క్క‌న పెట్టింది. ఫ‌లితంగా పాక్‌లో పంట‌లు ఎండిపోతున్నాయి. దీనిపై ప్ర‌పంచ బ్యాంకు జోక్యం చేసుకోవాల‌ని పాక్ ప్రాధేయ ప‌డింది. కానీ, ప్ర‌పంచ బ్యాంకు తాము ఈ విష‌యంలో ఏమీ చేయ‌లేమ‌ని స్ప‌ష్టం చేసింది. అంటే.. మొత్తంగా ఇటు పార్ల‌మెంటు, అటు ప్ర‌జ‌లు, మ‌రోవైపు ప్ర‌పంచ స్థాయిలోనూ ప్ర‌ధాని షెహ‌బాజ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. మ‌రి ఆయ‌న ఏమ‌వుతారు? ఏం చేస్తార‌నేది చూడాలి.