ఏపీలో పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు సైలెంట్ అయ్యారు. మరి వీరికి క్రియాశీల రాజకీయాలు బోరు కొట్టాయా ? లేక.. ఆయా పార్టీల తీరుపై వారు అలక బూనారా? అనేది చర్చకు దారితీసింది. కీలక సమయంలో నాయకులు మౌనంగా ఉండడంతో వైసీపీ ఇబ్బందులు పడుతోంది. ఇక, ప్రభుత్వం జోరుగా ఉన్న సమయంలో సర్కారు సైడు వాయిస్ వినిపించడంలో సీనియర్లు ముందుకు రాకపోవడంతో టీడీపీ కూడా ఇబ్బందులు పడుతోంది.
ఇక, జనసేనలో నాయకులు ఉన్నా.. వారంతా అధినేతపైనే డిపెండ్ అయిపోయారు. మరో పార్టీ బీజేపీలో వర్గ పోరు జోరుగా సాగుతోంది. ఇక్కడ రెండు వర్గాలు ఆధిపత్య రాజకీయాలు సాగిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్ లో అసలు ఊపు ఉత్సాహం కూడా కరువయ్యాయి. దీంతో దాదాపు రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా.. సీనియర్ల వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీలో సీనియర్లు ఎవరూ మీడియా ముందుకు రావడం లేదు.
సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నవారు.. పదవులు దక్కించుకున్నవారు.. ఇంటికే పరిమితమవుతున్నారు. మరికొందరు.. కాలక్షేపం కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. దీంతో వాయిస్ వినిపించేందుకు జూనియర్లను ఎంచుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక, వైసీపీలో జగన్ అంటే గిట్టని వారు.. ఆయన విధానాలను వ్యతిరేకిస్తున్నవారు.. కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. కొందరు రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నారు. బీజేపీలో ఆర్ఎస్ ఎస్ వర్గంగా ఉన్నవారు.. రాజకీయాలను కేంద్రంగా చేసుకున్న వారు.. రెండు వర్గాలుగా చీలిపోయారు.
కాంగ్రెస్ పార్టీలో రఘువీరారెడ్డికి అధిష్టానం కీలక పాత్ర అప్పగించినా.. ఆయన తప్పుకొన్నారు. ఇతర నేతలు కూడా.. మనకెందుకులే.. ఎన్నికల వరకు మౌనంగా ఉందాం.. అనే ఫార్ములాను అవలంభిస్తున్నారు. ఇక, జనసేనలో నాయకులు ఏమీ మాట్లాడొద్దని కొన్నాళ్ల కిందట తిరుమల, తిరుపతి వివాదాలు వచ్చినప్పుడు పార్టీ ఒక లైన్ గీసింది. అయితే.. నాయకులు అప్పటి నుంచి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలా.. రాష్ట్రంలో సీనియర్లుగా ఉన్న నాయకులు.. మౌనమే నీభాష అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates