తిరుమల కొండపై ఇక ‘చైనీస్’ దొరకదు!

కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఏడు కొండల్లో భక్తులు ఎంతో నిష్టతో సాగుతూ ఉంటారు. వెంకన్న దర్శనమే పరమావధిగా ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న భక్తులు… తిరుమలలో ఎంతో భక్తి శ్రద్ధలతో సాగుతూ ఉంటారు. అందులో భాగంగా మద్యం, మాంసం, ధూమపానం ఇతరత్రా అసాంఘీక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సాగే భక్తులు… వెంకన్న దర్శనంతో తమ జన్మ ధన్యమైందన్న భావనతో పులకించిపోతారు. ఇలాంటి పరమ పవిత్రమైన కోవెలలో ఇకపై చైనీస్ వంటకాలు కూడా కనిపించవు.

తిరుమల కొండపై చైనీస్ వంటకాలైన ఫ్రైడ్ రైస్, మంచూరియా, నూడిల్స్ తదితర ఆహార పదార్థాల తయారీ, విక్రయం, భుజించడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిషేధిస్తూ గురువారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గురువారం కొండపై కొనసాగుతున్న హోటళ్ల నిర్వాహకులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఓ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా హోటళ్లలో పాటించాల్సిన పారిశుద్ధ్యం, భోజనంలో నాణ్యత తదితరాలపై చర్చ జరిగింది. అదే సమయంలో చైనీస్ వంటకాల వాడకంపై పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు చౌదరి ప్రకటించారు.

వాస్తవానికి చైనీస్ వంటకాలు రెడీ టూ ఈట్ మాదిరిగా ఆర్డర్ ఇచ్చిన నిమిషాల్లోనే చేతిలో పెడతారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి తిరుమల వస్తున్న భక్తులు.. స్థానిక ఆహారం కంటే కూడా చైనీస్ కనబడిందంటే చాలు… అటుగా పరుగులు పెడుతున్నారు. ఇదే విషయాన్ని హోటల్ నిర్వాహకులు వెల్లడించగా… చైనీస్ మాటున చాలా మంది వ్యాపారులు మాంసాహారాన్ని కూడా విక్రయిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. మాంసాహారం వినియోగమే కాకుండా కనీసం ఆ ప్రస్తావన కూడా తిరుమల కొండపై వినిపించకుండా ఉండేందుకే చైనీస్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెంకయ్య తెలిపారు. ఈ నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు.