2027లో జగన్ 2.0 పాదయాత్ర అంట!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో బలంగా కనిపించిన జగన్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. ఈ షాక్ నుంచి ఇతరుల సంగతేమో తెలియదు గానీ… జగన్ అయితే ఇంకా తేరుకోలేదనే చెప్పాలి. ఎక్కువ కాలం బెంగళూరులోని తన పాలెస్ లో సేదదీరుతున్న జగన్… ఏదో తనకు వీలున్నప్పుడు తాడేపల్లి వస్తూ వెళుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీలక నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం ఓ కీలక ప్రకటన చేశారు. 2027లో జగన్ పాదయాత్ర చేపడతారని… ఇది 2.0 పాదయాత్ర రేంజిలో ఉంటుందని చెప్పారు.

సోమవారం విశాఖలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో భాగంగా ప్రసంగించిన గుడివాడ… తదుపరి ఎన్నికల దాకా పార్టీ శ్రేణులను కాపాడుకునే దిశగా తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు అంటే ఎంతకాలమని ప్రశ్నించిన గుడివాడ.. ఇలా కళ్లు మూసి అలా తెరిస్తే ఐదేళ్లు గడిచిపోతాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఏడాది గడిచిపోయిందని అన్నారు. ఇంకా నాలుగేళ్లు అంతే.. ఈ నాలుగేళ్లు ఓపిక పడితే అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ఆయన జోస్యం చెప్పారు. ఈ మాట తాను చెబుతున్నది కాదన్న ఆయన స్వయంగా జగనే చెప్పారంటూ గుర్తు చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఈ దఫా అన్యాయం జరగదని కూడా ఆయన భరోసా ఇచ్చారు.

గతంలో జరిగిన దానిని పట్టించుకోరాదని కూడా అమర్నాథ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గుడివాడ నోట నుంచి ఓ ఆసక్తికర వ్యాఖ్య వినిపించింది. ఇష్టమున్న వారే పార్టీలో ఉండండి అంటూ ఆయన ఓ సంచలన వ్యాఖ్య చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని చెప్పిన అమర్నాథ్.. పార్టీని వీడే వారిని బతిమాలి బామాలే పరిస్తితులు అయితే లేవన్నట్లుగా పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్య ద్వారా ఇష్టముంటే పార్టీలో ఉండండి… లేదంటే వెళ్లిపోండి అన్నట్టుగా గుడివాడ వ్యాఖ్యలు వినిపించాయి. అనంతరం పార్టీ కమిటీలను పునర్మించుకుందామని చెప్పిన గుడివాడ… అందుకు ఓ ఏడాది సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది భారీ ఎత్తున పార్టీ కార్యక్రమాలు చేపడతామంటూ ఆయన తెలిపారు.

గత 11 నెలల కూటమి పాలన చూసిన ప్రజలు జగన్ మళ్లీ పాదయాత్ర ఎప్పుడు మొదలెడతారని అడుగుతున్నారని అమర్నాథ్ అన్నారు. 2027 వస్తే… జగనన్న పాదయాత్ర 2.0 ఉంటుందని ఆయన ప్రకటించారు. ఈ పాదయాత్రను చేపట్టాల్సిన బాధ్యత జగన్ పైనే ఉందని గుడివాడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే గ్రామాలకు వెళితే.. కొత్తగా పింఛన్లు రావడం లేదని జనం చెబుతున్నారని ఆయన అన్నారు. లబ్ధిదారుల ఇళ్లలో ఎవరైనా చనిపోతేనే… ఆయా కుటుంబంలో కొత్త వారికి పింఛన్లు ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేతిలో ఇప్పటికే రాష్ట్ర ప్రజలు నాలుగు సార్లు మోసపోయారన్న గుడివాడ…ఐదో సారీ బాబు చేతిలో మోసపోతే ఇక దేవుడు కూడా ప్రజలను రక్షించలేరన్నారు.