అమరావతికి రక్షణ కవచంలా ‘గుల్లలమోద’

శత్రు దుర్బేధ్యంగా దేశాన్ని తీర్చిదిద్దే క్రమంలో భారత్ తన సాధనా సంపత్తిని పెంచుకుంటోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్షిపణి పరీక్షా కేంద్రాల సంఖ్యను కూడా పెంచుకుంటోంది. అందులో భాగంగా ఏపీలో ఓ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కేంద్రం అటు జాతీయ భద్రతతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కూడా రక్షణ కవచంగా మారనుందని చెప్పక తప్పదు. అమరావతికి కూతవేటు దూరంలో ఏర్పాటు కానున్న ఈ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని… అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు శుక్రవారం వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి నుంచే వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

అమరావతికి అతి సమీపంలో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని గుల్లలమోద గ్రామంలో ఈ క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు కానుంది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక దశలో రూ.1,500 కోట్లను ఖర్చు చేయనుంది. ప్రస్తుతం ప్రధాని ఈ రూ.1,500 కోట్లతో చేపట్టే క్షిపణి పరీక్షా కేంద్రానికే వర్చువల్ గా ప్రారంభోత్సవం చేయనున్నారు. తదుపరి ఈ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం మరింతగా తీర్చి దిద్దనుంది. ఇందుకోసం ఈ పరీక్షా కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.20 వేల కోట్లను ఖర్చు చేయనుంది. అంటే… భవిష్యత్తులో భారత్ పరీక్షించనున్న దాదాపుగా అన్ని క్షిపణుల పరీక్షలన్నీ కూడా గుల్లలమోద కేంద్రం నుంచే జరగనున్నాయని చెప్పొచ్చు.

అంతరిక్ష ప్రయోగాలకు గానీ, క్షిపణి ప్రయోగాలకు గానీ… ఏపీలోని తీర ప్రాంతం అత్యంత అనుకూలమే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటు అయ్యేలా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు… కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. కొత్తగా ఓ క్షిపణి పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కేంద్రం నిర్ణయం తీసుకోగానే.. ఆ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు… విషయాన్ని నేరుగా ప్రధాని వద్ద ప్రస్తావించారు. క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు గుల్లలమోద అనుకూలంగా ఉన్న విషయాన్ని ప్రస్తావించడమే కాకుండా… సదరు క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుతో ఏపీకి కలిసివచ్చే అంశాలను కూడా ఆయన మోదీ ముందుంచారు. దీంతో గుల్లలమోదలోనే క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు మోదీ అంగీకరించారు. తాజాగా అమరావతి పనుల పునర్నిర్మాణంతో పాటుగా కొత్తగా గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రానికి కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు.